32 ఏళ్లకు తల్లి తొలి ప్రేమకథను సాకారం చేసిన కూతుళ్లు
తిరువనంతపురం: ప్రేమకు వయసుతో పనిలేదు. మరణమే ప్రేమను శాశ్వతంగా విడదీయగలదు అనేలా కేరళలో ఓ అరుదైన సంఘటన జరిగింది. ఇద్దరు కుమార్తెలు తమ తల్లి లవ్ స్టోరీని పరిపూర్ణం అయ్యేలా చేశారు. తల్లి ప్రేమించిన తొలి ప్రేమికుడితో వివాహం జరిపించారు. సినిమాలో మాదిరి 1980ల్లో జరిగిన ఈ ప్రేమకథను గురించి తెలుసుకుందాం.
1984లో అనిత చెంబువిలాయ్ (ప్రస్తుత వయసు 52) అనే అమ్మాయి కొల్లాం దగ్గరలోని ఒచిరాలో పదో తరగతి చదివేది. ఓ ట్యూషన్ సెంటర్లో విక్రమన్ అనే అతను టీచర్గా పనిచేసేవాడు. ఆ సమయంలో అనిత, విక్రమన్ ప్రేమలో పడ్డారు. వీరి పెళ్లికి అనిత తండ్రి నో చెప్పడంతో విక్రమన్కు దూరమైంది.
ఆ తర్వాత విక్రమన్ ఆమెకు దూరంగా చవారకు వెళ్లిపోయాడు. అక్కడ ఓ రాజకీయ కార్యకర్తగా పనిచేశాడు. ఆ తర్వాత అనిత తన జీవితంలో ఒక్కసారి కూడా విక్రమన్ను కలవలేదు. ఆ తర్వాత అనిత తండ్రి ఆమె కంటే వయసులో చాలా పెద్ద వాడైన వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాడు.

పెళ్లైన కొన్ని సంవత్సరాలకే అనిత భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అనితకు ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఆమె భర్త ఆత్మహత్య చేసుకునే సమయానికి పెద్ద కుమార్తె ఆతిరా దతన్కు ఎనిమిదేళ్లు. భర్తను కోల్పోయినప్పటికీ, తన ఇద్దరు కూతుళ్లకు మంచి చదువు చెప్పించి, ప్రయోజకురాళ్లను చేసింది.
ఇందుకోసం అనిత ఎంతగానో కష్టపడింది. ఇదే సమయంలో అనిత కుమార్తెలు పెరిగిపెద్ద వాళ్లయ్యాక తల్లి ప్రేమకథ గురించి తెలుసుకున్నారు. తమ కోసం జీవితాన్నే త్యాగం చేసి తల్లికి ఆమె ప్రేమికుడిని దగ్గరకు చేర్చి మలి జీవితంలో సంతోషంగా జీవించేలా చేయాలని వారిద్దరూ నిర్ణయించారు.
అయితే కూతుళ్లిద్దరికీ వివాహం చేశాక తన జీవితం గురించి ఆలోచిస్తానని అనిత చెప్పింది. పెద్ద కుమార్తె ఆతిరాకు పెళ్లయ్యాక వివాహం చేసుకునేందుకు అనిత అంగీకరించింది. ఇక విక్రమన్ ఆచూకీ కోసం వెతకసాగారు. చవారాలో ఉన్న విక్రమన్ను కలిసి అసలు విషయాన్ని చెప్పి తల్లితో పెళ్లికి ఒప్పించారు.
ఈ నెల 21వ తేదీన అనిత (52), విక్రమన్ (68)లకు వివాహం జరిపించారు. ఇలా 32 ఏళ్ల తర్వాత వీరి ప్రేమకథకు కూతుళ్లు ముగింపు పలికారు.












Click it and Unblock the Notifications