కిరణ్ తీర్మానం ఊహించిందే, తేడా పడదు: సింఘ్వీ
న్యూఢిల్లీ/ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)పై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీర్మానం ప్రతిపాదన ఊహించిందేనని ఎఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. తెలంగాణ బిల్లుపై శాసనసభా పరిణామాలు ఊహించనవి కావని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు యుపిఎ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రకటనకు కాంగ్రెసు పార్టీ కట్టుబడి ఉందని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లుకు శాసనసభ ఆమోదం అవసరం లేదని, తెలంగాణ బిల్లుపై అంతిమ నిర్ణయం పార్లమెంటుదేనని ఆయన అన్నారు. అతి తక్కువ సమయంలో పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా చూస్తామని ఆయన చెప్పారు.

తెలంగాణ బిల్లుపై శాసనసభలో జరిగిన పరిణామాలు నైతికతకు సంబంధించిన అంశం కాదని ఆయన అన్నారు. తాము రాజ్యాంగ పద్ధతుల ప్రకారం నడుచుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత వైఖరిని అవలంబిస్తున్నారని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ఆగదని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బిఎసిలో చర్చించకుండా సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి విలువ లేదని ఆయన అన్నారు. తీర్మానానికి కారణమైనవారంతా కుట్రదారులే అని ఆయన విమర్శించారు. బిఎసిలో లేని తీర్మానాన్ని సభలోకి తీసుకు రావడం సరి కాదని, 77 నిబంధన కింద నోటీసు ఇవ్వడం చట్టవిరుద్ధమని ఆయన అన్నారు.
మంత్రులతో చర్చించకుండా ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీసు చెల్లదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీసు సభా సంప్రదాయాలకు విరుద్ధమని ఆయన అన్నారు. బిల్లును పార్లమెంటులో 15 రోజుల్లోగా ఆమోదించేందుకు యుపిఎ ప్రభుత్వం కృషి చేయాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications