మలయాళీ నర్స్లపై కేజ్రీ పార్టీ లీడర్ కామెంట్ దుమారం
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) నేతలు వరుసగా చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా కుమార్ విశ్వాస్ గతంలో కేరళ నర్సులపై అభ్యంతరకర (సెక్సియెస్ట్) వ్యాఖ్యలు చేసినందుకు విమర్శలు ఎదుర్కొంటున్నారు. కుమార్ విశ్వాస్ రచయిత నుండి రాజకీయ నాయకుడిగా మారారు.
దాదాపు ఆరేళ్ల క్రితం ఆయన కేరళ నర్సులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లుగా వీడియోలు నెట్లో కనిపిస్తున్నాయి. 23 నిమిషాల యూట్యూబ్ క్లిప్లో ఆయన మాట్లాడారట.
గతంలో ఎవరైనా పురుషులు అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరితే అక్కడ కేరళ నర్సులు ఉన్నందువల్ల సిస్టర్ అని పిలిచేందుకు కంఫర్ట్గా ఫీల్ అయ్యే వారని, కేరళకు చెందిన చాలామంది తమ ప్రొఫైల్స్లో వారి ఫోటోలు పెట్టరని, ఎందుకో తెలియదని వ్యాఖ్యానించారు. వారు నల్లగా ఉంటారని ఆయన పరోక్షంగా చెప్పారు.
కుమార్ విశ్వాస్ వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. మహిళా కాంగ్రెసు నేత బిందు కృష్ణ మాట్లాడుతూ... కుమార్ పైన క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రుల్లో బాధితులకు సేవ చేయడంలో కేరళ నర్సులు ముందుంటారని ఆమె అన్నారు. కుమార్ విశ్వాస్ వ్యాఖ్యల పైన ఎఎపి వివరణ ఇవ్వాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.