చీకటిని చీల్చుకుంటూ పొన్నాంబలంమేడు పర్వత శిఖరాల్లో మకర జ్యోతి దర్శనం
తిరువనంతపురం: మకరవిళక్కు పర్వం సందర్భంగా శనివారం లక్షలాది మంది శబరిమల భక్తులు మకర జ్యోతిని దర్శించుకున్నారు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ హరిహరక్షేత్రం అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు.. వారి సుదీర్ఘ నిరీక్షణకు తెరవేస్తూ ఆలయానికి ఈశాన్య దిశలో పర్వశ్రేణుల నుంచి వెలుగులీనుతున్న జ్యోతి దర్శనమిచ్చింది.
శనివారం రాత్రి 6.45 గంటలకు జ్యోతి దర్శనంతో లక్షలాది మంది భక్తులు పులకించిపోయారు. హరిహర సుతుడైన స్వామి అయ్యప్పను స్మరిస్తూ స్వామియే శరణం అయ్యప్ప అంటూ శరణుఘోషలతో శబరిగిరులు ప్రతిధ్వనించాయి. కాంతమాల కొండలపై దేవతలు, రుషులు కలిసి భగవంతునికి హారతి ఇస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
అంతకుముందు పందాళం నుంచి తీసుకువచ్చిన తిరువాభరణాలను ప్రధాన అర్చకులు స్వామివారికి అలంకరించారు. అనంతరం మూలమూర్తికి హారతిచ్చారు. ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే చీకట్లను తొలగిస్తూ పొన్నాంబలంమేడు పర్వత శిఖరాల్లో జ్యోతి దర్శనమిచ్చింది.
హిందూ బంధువులకు మకరజ్యోతి దర్శన శుభాకాంక్షలు.
— pothuguntarameshnaidu (@pothuguntabjp) January 14, 2023
స్వామియే శరణం అయ్యప్ప !
జ్యోతి స్వరూపనే శరణం అయ్యప్ప !!#MakaraVilakku #Ayyappa #SaranamAyyappa #Sabarimala pic.twitter.com/zLqhL7ynJs
స్వామియే శరణం అయ్యప్ప అంటూ జ్యోతిని దర్శించుకున్న భక్తులు ఆనందపరావశ్యులయ్యారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. జనవరి 20వ తేదీన స్వామివారి ఆలయం మూసివేయనున్నారు.