మానవత్వం మంట కలిసిన వేళ: మద్యం బాటిళ్లకై పరుగులు.. మహిళ ఆర్తనాదాలు పట్టని వైనం!
రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
జల్గావ్: కళ్లముందే అఘాయిత్యం జరుగుతున్నా.. అడ్డుకోవడానికి కనీస ప్రయత్నం కూడా చేయని సంఘటనలు ఇటీవలి కాలంలో అనేకం చోటు చేసుకున్నాయి. రోడ్డుపైనే అత్యాచారం జరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోని తీరు విస్మయపరిచింది.
తాజాగా ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మహిళ సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తుంటే.. ఆమెను పట్టించుకునేవారే కరువయ్యారు. మహారాష్ట్రలోని జల్గావ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. జల్గావ్ లోని భుసావల్ ఫౌజ్ పూర్ హైవేపై చోటు చేసుకున్న ఈ రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
గాయాలపాలైన మహిళ రక్తపు మడుగులోనే సహాయం కోసం రోధించింది. అయితే అక్కడున్న జనం మాత్రం.. మద్యం బాటిళ్లను తీసుకెళ్లడంలో ఉత్సహం చూపించారు తప్పితే.. ఆమెను కాపాడే ప్రయత్నం చేయలేదు. ట్రక్కులోని మద్యం బాటిళ్లన్ని ఖాళీ అయ్యాక.. అప్పుడు గానీ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లలేదు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్నది ఇంకా తెలియరాలేదు.