బతుకు..! తమిళనాడును బతికించు: కర్ణాటకకు సుప్రీం హితవు
న్యూఢిల్లీ: నదీ జలాలు వాడుకుంటూ మీరు బతకడమే కాకుండా, పొరుగు రాష్ట్రాలను బతికించేందుకు కూడా సహకరించాలని కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. తమిళనాడు రాష్ట్రం నీటి కోసం ఇబ్బందులను ఎదుర్కొంటున్న దృష్ట్యా ఆ రాష్ట్రానికి నీటిని వదలాలని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా 'బతుకు..! బతికించు' అని వ్యాఖ్యానించింది సుప్రీం. ఏ మేరకు నీటిని తమిళనాడుకు ఇవ్వగలరో చెప్పాలని ప్రశ్నించింది. రెండు రాష్ట్రాలూ నీటి వివాదాలను పెంచుకోరాదని తేల్చి చెప్పింది.
దిగువకు కావేరి నది నీటిని వదలక పోవడంతో నదిలోని మత్స్య సంపదను కోల్పోతున్నామని తమిళనాడు మత్స్యకారులు తీవ్ర ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
నదీజలాల ట్రైబ్యునల్ ఆదేశాలు ఉన్నప్పటికీ నీటి విడుదల విషయంలో కర్ణాటక సర్కారు మొండి వైఖరితో ఉందని తమిళనాడు ఆరోపించింది. ఈ విషయంలో కోర్టులో వాదనలు జరుగగా, తమిళనాడు వాసులు బాధితులుగా మిగలకుండా చూసుకోవాలని కర్ణాటకకు సూచించింది.