నేతాజీ జయంతి: 775 మంది ఎంపీల్లో అద్వానీ ఒక్కరే
న్యూఢిల్లీ: పార్లమెంటు భవనంలో గురువారం జరిగిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు వెలవెలబోయాయి. మొత్తం 775 మంది సిట్టింగ్ ఎంపీలలో భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ ఒక్కరే సమావేశానికి హాజరయ్యారు. మరో ముగ్గురు మాజీ ఎంపీలతో కలిసి ఆయన పార్లమెంటు సెంట్రల్ హాలులోని నేతాజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
గంటకు పైగా జరిగిన ఈ సమావేశానికి ఉభయ సభల ప్రిసైడింగ్ అధికారులు కూడా హాజరు కాలేదు. సాధారణంగా ప్రిసైడింగ్ అధికారుల ఆధ్వర్యంలోనే దివంగత నేతల, స్వాతంత్ర సమరయోధుల జయంతి, వర్ధంతులు జరుగుతాయి. నేతాజీ వారసులమని చెప్పుకునే పశ్చిమ బెంగాల్కు చెందిన తృణమూల్ కాంగ్రెసు, ఫార్వర్డ్ బ్లాక్తో పాటు ఇతర పార్టీల ప్రస్తుత సభ్యులు గాని, మాజీ ఎంపిలు గాని హాజరు కాలేదు.
నేతాజీ జయంతి సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో ఆయనకు నివాళులర్పించేందుకు వచ్చిన ఏకైక ఎంపీ అద్వానీ మాత్రమే వచ్చారు. లోక్సభ కార్యాలయం నిర్వహించిన కార్యక్రమంలో అద్వానీతో పాటు హాజరైన ముగ్గురు మాజీ ఎంపీలు బిజెపి, సిపిఎంలకు చెందినవారు. కాగా రాష్ట్రపతి భవన్లో నేతాజీకి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నివాళి అర్పించారు.
మరోవైపు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు రాజ్ నాథ్ సింగ్కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేతాజీ మృతి, అదృశ్యం వెనుక మిస్టరీని బయట పెట్టాలని డిమాండ్ చేశారు.