అట్టుడికిన సభలు: అవిశ్వాస తీర్మానంపై సభలో ప్రకటన
న్యూఢిల్లీ: తెలంగాణ అంశం పార్లమెంటు సమావేశాలను సజావుగా సాగనివ్వడం లేదు. రెండో రోజైన గురువారం కూడా ఉభయ సభలు అట్టుడికాయి. ఉదయం వాయిదా పడిన సభలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే ఉభయ సభల్లో సీమాంధ్ర ఎంపీలు సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ వెల్లోకి చొచ్చుకొచ్చారు. రాజ్యసభలో సభ్యులు ప్లకార్డులతో నిరసనలు తెలిపారు.
దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. రాజ్యసభను చైర్మన్ రెండు గంటలకు వాయిదా వేశారు. లోకసభలోను అదే పరిస్థితి. సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు సబ్బం హరి, సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ ఎంపి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిలు ఇచ్చిన అవిశ్వాసం నోటీసులు అందాయని సభాపతి మీరా కుమార్ ప్రకటించారు. అయితే, సభలో గందరగోళం ఉన్నందున అవిశ్వాసం తీర్మానం నోటీసును చేపట్టలేకపోతున్నట్లు తెలిపారు.

సీమాంధ్ర ఎంపీలు జై సమైక్యాంధ్ర అంటూ వెల్లోకి వచ్చారు. తెలంగాణ ప్రాంత సభ్యులు కూడా జై తెలంగాణ నినాదాలు చేశారు. దీంతో సభ జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తింది. సభ సజావుగా నడిచేందుకు సహకరించాలని మీరా కుమార్ కోరినా ఫలితం లేకుండా పోయింది. దీంతో లోకసభను రేపటికి వాయిదా వేశారు. మొదటిసారి రెండు నిమిషాలకే వాయిదా పడిన లోకసభ రెండోసారి పదినిమిషాలకు వాయిదా పడింది.
మరోవైపు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, డిఎంకె అధ్యక్షులు కరుణానిధిలను కలిసేందుకు చెన్నై వెళ్లారు. ఆయన జయలలితతో భేటీ అయ్యారు. అంతకుముందు కాంగ్రెసు పార్టీ పైన చంద్రబాబు నిప్పులు చెరిగారు. చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ ద్వంద్వ నీతిని ఎండగట్టేందుకే తాను జాతీయ నేతలందరినీ కలుస్తున్నానని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడిందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications