మాదాపూర్ ఎస్సైకి జైలు శిక్ష.. జరిమానా కూడా..
ఎక్కడ చూసినా అవినీతే.. పనుల కోసం వస్తే అంతే సంగతులు. పోలీసు శాఖలో కూడా వేధింపులు తప్పడం లేదు. ఇతర శాఖల్లో మాదిరిగా పోలీసు శాఖలో ఏసీబీ అధికారులు చాలా తక్కువగా రైడ్ చేస్తుంటారు. కొంత కాలంగా పోలీసు అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుతున్నారు. లంచం కేసులో ఎస్సైకి ఏకంగా రెండేళ్ల జైలు శిక్ష పడింది.
మాదాపూర్ ఎస్ఐగా పని చేస్తున్న కె రాజేంద్ర.. 2013లో రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో పనిచేశారు. 2013 జూన్లో ఇర్షాద్ ఖురేషీ అనే వ్యక్తి మోటారు బైక్ విడుదల చేసేందుకు రాజేంద్ర 10 వేల రూపాయలు డిమాండ్ చేశారు. ఎస్ఐ వేధింపులను భరించలేక ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు. దీంతో రైడ్ చేసిన ఏసీబీ అధికారులు.. లంచం తీసుకుంటుండగా ఎస్ఐ రాజేంద్రను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో ఎస్ఐపై కేసు నమోదు చేశారు.
తాజాగా ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. మాదాపూర్ ఎస్సై కె రాజేంద్రకు ఏసీబీ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, ఐదు వేల రూపాయల జరిమానా విధించింది. జరిమానా కట్టకపోతే మరో మూడు నెలలు పొడిగించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. సో.. చట్టానికీ అతీతంగా ప్రవర్తిస్తే ఎవరికైనా చర్యలు తప్పవు. ఇదే విషయాన్ని మరోసారి రుజువు చేశారు.