మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు బిగ్ షాక్ : అజ్ఞాతంలోకి 17 మంది ఎమ్మెల్యేలు,మంత్రులు..
రాజ్యసభ ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్లో రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతోంది. తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత జ్యోతిరాధిత్య సింధియాతో పాటు 17 మంది ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇటీవలే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ ఓ హోటల్లో నిర్బంధించిందని కాంగ్రెస్ ఆరోపించిన ఘటన మరవకముందే.. ఈ పరిణామం తెరపైకి రావడం కాంగ్రెస్కు ఊహించని షాక్ ఇచ్చినట్టయింది. సింధియా సహా అజ్ఞాతంలోకి వెళ్లిన ఎమ్మెల్యేలంతా బీజేపీతో టచ్లో ఉన్నారా.. లేక కమల్నాథ్కు ఝలక్ ఇచ్చేందుకు సింధియానే ఇదంతా చేస్తున్నాడా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.
ఎమ్మెల్యేలు,మంత్రుల ఫోన్లు స్విచ్చాఫ్
ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లారన్న సమాచారం తెలియగానే ముఖ్యమంత్రి కమల్నాథ్ ఢిల్లీ పర్యటన నుంచి అర్ధాంతరంగా వెనక్కి వచ్చేశారు. ఎమ్మెల్యేలను ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినా స్విచ్చాఫ్ అనే సమాధానం వస్తోంది. అజ్ఞాతంలో ఉన్నవారిలో ఆరోగ్యశాఖ మంత్రి తులసి సిలవత్, కార్మిక మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా,రవాణా మంత్రి గోవింద్ సింగ్ రాజ్పుత్,మహిళా శిశు సంక్షేమ మంత్రి ఇమర్తి దేవి,సివిల్ సప్లై మంత్రి ప్రద్యుమ్న సింగ్ తోమర్,స్కూల్ ఎడ్యుకేషన్ మంత్రి ప్రభుర చౌదరి ఉన్నారు.ఎమ్మెల్యేలు,మంత్రుల అజ్ఞాతంపై ఓ సీనియర్ కాంగ్రెస్ నేత మాత్రం.. అంత సీరియస్ ఇష్యూ ఏమీ కాదన్నారు.
సింధియా కనుసన్నుల్లోనా లేక.. బీజేపీ ఆపరేషన్ ఆకర్షా..?
ఇటీవలే నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను,ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలను,ఒక ఎస్పీ,ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేను బీజేపీ గురుగ్రామ్లోని ఓ హోటల్లో బలవంతంగా నిర్బంధించిందని కాంగ్రెస్ ఆరోపించింది. తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రలోభాలకు పాల్పడుతోందని ఆరోపించింది. ఇంతలోనే సింధియా సహా 18 మంది ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లడం చర్చనీయాంశమైంది. ఇదంతా కాకతాళీయమేనా.. లేక ప్లాన్ ప్రకారమే జరుగుతోందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ ప్లాన్ ప్రకారమే జరిగితే.. ఇది సింధియా కనుసన్నుల్లో జరుగుతోందా.. లేక బీజేపీనే ఆపరేషన్ కమల్ మొదలుపెట్టిందా అన్న చర్చ జరుగుతోంది.
Recommended Video
చెరో రాజ్యసభ సీటు.. మూడో సీటు కోసం ఇరు పార్టీల ప్రయత్నాలు..
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 230. అయితే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే,ఒక బీజేపీ ఎమ్మెల్యే మృతితో ప్రస్తుత సభ్యుల సంఖ్య 228కి చేరింది. కాంగ్రెస్కి సొంతంగా 114 ఎమ్మెల్యేలు, మిత్రపక్షాల మద్దతుతో కలుపుకుని 122 సభ్యుల బలం ఉంది. అటు బీజేపీకి 107 మంది సభ్యుల బలం ఉంది. ఈ లెక్కన చెరో రాజ్యసభ సీటు దక్కే అవకాశం ఉంది. అయితే మూడో రాజ్యసభ సీటు కోసం ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అది జరగాలంటే.. ఇరు పార్టీల్లో ఏదో ఒక పార్టీ ఎమ్మెల్యేలు ప్రత్యర్థి పార్టీకి మద్దతునివ్వాలి. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లడం ఆ పార్టీని కలవరపెడుతోంది.
మొత్తం మీద మధ్యప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు రాజకీయ సంక్షోభానికి దారితీసే అవకాశం లేకపోలేదు.