Maharashtra Politics:జైపూర్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..క్యాంపు రాజకీయాలు ప్రారంభం
మహారాష్ట్ర అసెంబ్లీ గడువు శుక్రవారం అర్థరాత్రితో ముగియనుంది. ఇక ఎట్టి పరిస్థితుల్లోను ప్రభుత్వం ఏర్పాటు చేయక తప్పదు. అయితే బీజేపీ శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వేరే దారి కమలం పార్టీకి కనిపించడం లేదు. కానీ ఉధ్దవ్ థాక్రే మాత్రం ముఖ్యమంత్రి పీఠం పై స్పష్టత ఇచ్చాకే ముందుకెళ్లాలని పట్టు పట్టారు. ఈ క్రమంలోనే దేశం మొత్తం ముంబై వైపు చూస్తోంది.

ఉత్కంఠంగా మారిన మహా రాజకీయాలు
మహారాష్ట్ర రాజకీయాలు క్షణం క్షణం ఉత్కంఠంగా మారుతున్నాయి. ఈ అర్థరాత్రితో అసెంబ్లీ గడవు ముగియనుండగా తప్పని పరిస్థితుల్లో బీజేపీ - శివసేనలు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే శివసేన మాత్రం బీజేపీకి అండగా నిలవడం లేదు. ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో ఉంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారు. అయితే ఈ ప్రతిష్టంభనపై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే ఓ కీలక నిర్ణయం శుక్రవారం తీసుకునే అవకాశం ఉంది. ఇక ముంబైలో జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్లు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

జైపూర్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తరలింపు
ఇక సమయం దగ్గర పడుతుండటంతో క్యాంపు రాజకీయాలకు తెరలేచింది. బీజేపీ తనకు కావాల్సిన సంఖ్యా బలం కోసం అన్ని అస్త్రాలు ప్రయోగిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తోందనే ఆరోపణలు హస్తం పార్టీ చేస్తోంది. అందుకే తమ ఎమ్మెల్యేలను రాజస్థాన్కు తరలించాలని భావించినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఇప్పటికే 44 మంది ఎమ్మెల్యేల్లో చాలామంది జైపూర్కు చేరుకున్నారు.ఇక మిగతావారు మధ్యాహ్నం కల్లా జైపూర్కు చేరే అవకాశం ఉంది.

హోటల్లో ఎమ్మెల్యేలను కలిసిన ఆదిత్య థాక్రే
ఇదిలా ఉంటే శివసేన పార్టీ ఎమ్మెల్యే ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే గత రాత్రి హోటల్లో బస చేస్తున్న తమ పార్టీ ఎమ్మెల్యేలను కలిసి వారితో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రేల మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ఇక బీజేపీ శివసేనలు ఇద్దరికిద్దరు ఏకాభిప్రాయంకు రాకపోవడంతో పరిస్థితులు గంట గంటకు మారుతున్నాయి. రెండు పార్టీలకు సమయం 24 గంటలు మాత్రమే ఉండటంతో ఇప్పటి వరకు ఇద్దరూ ఒక తాటిపైకి రాలేదు. ఇది మరికొన్ని గంటల పాటు ఇలానే కొనసాగితే రాష్ట్రపతి పాలన తప్పనిసరి అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications