మహారాష్ట్రలో కొత్తగా 55వేల కరోనా కేసులు... వలస కార్మికుల వల్లే వైరస్ వ్యాప్తి చెందుతోందన్న రాజ్ థాక్రే...
మహారాష్ట్రలో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 55,469 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల క్రితమే అత్యధికంగా 57వేల కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 31,13,354కి చేరింది. ప్రస్తుతం 55,469 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 297 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 56,330కి చేరింది. ఇప్పటివరకూ 25,83,331 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారం నుంచి మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ప్రతీరోజూ దాదాపుగా 50వేల కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య విపరీతంగా పెరగడంతో హెల్త్ కేర్ వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది. పుణే లాంటి నగరాల్లో ఇప్పటికే అన్ని ఆస్పత్రులు కరోనా పేషెంట్లతో నిండిపోయాయి. దీంతో ఆయా ఆస్పత్రుల్లో.. ఆరుబయటే కొంతమంది పేషెంట్లకు పడకలు ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. దానికి తోడు ఆక్సిజన్,వెంటిలేటర్ల కొరత కూడా తీవ్రంగా ఉంది.
మహారాష్ట్రలో కరోనా పరిస్థితిపై మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ థాక్రే మాట్లాడుతూ... కేసుల సంఖ్య పెరగడానికి వలస కార్మికులే కారణమని అన్నారు.'మహారాష్ట్ర దేశంలోనే అత్యంత పారిశ్రామికీకరణ చెందిన రాష్ట్రం. సహజంగానే ఇతర రాష్ట్రాల నుంచి వలస కార్మికులు బతుకుదెరువు కోసం వస్తుంటారు. అయితే ఈ కార్మికులు ఎక్కడినుంచి వస్తున్నారో... ఆ రాష్ట్రాల్లో కరోనా టెస్టుల కోసం సరైన సదుపాయాలు లేవు.' అని రాజ్ థాక్రే అన్నారు.గతేడాది లాక్డౌన్ పీరియడ్లో స్వస్థలాలకు తరలివెళ్లిన వలస కార్మికులందరూ తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకోవాలని తాను విజ్ఞప్తి చేశానని గుర్తుచేశారు.
కాగా,కరోనా కట్టడి చర్యల్లో భాగంగా వీకెండ్స్లో పూర్తి స్థాయి లాక్డౌన్ను అమలుచేయనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 30 వరకూ వీకెండ్ లాక్డౌన్తో పాటు రాత్రిపూట 8గంటల నుంచి ఉదయం 7గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగనుంది. అలాగే పగటిపూట 144 సెక్షన్ అమలులో ఉండనుంది. ప్రభుత్వ కార్యాలయాలు కేవలం 50శాతం సామర్థ్యంతోనే పనిచేయనున్నాయి. ప్రైవేట్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలా సంస్థలు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ఆదేశించారు.