ఏడిపించారని ప్రతీకారం: భోజనంలో విషం కలిపిన 23 ఏళ్ల మహిళ, 5గురి మృతి
రాయగఢ్: మహారాష్ట్రలోని రాయగడ్కు చెందిన 23 ఏళ్ల మహిళ భోజనంలో విషం కలిపింది. దీంతో ఐదుగురు మృతి చెందగా, 120 మంది అస్వస్థతకు గురయ్యారు. తన శరీరం రంగుతో పాటు తన వంటపై బంధువులు సెటైర్లు వేసి ఏడిపించారు. దీంతో ఆమె ప్రతీకారం తీర్చుకునేందుకు విషం కలిపింది.
రాయ్గఢ్ జిల్లాలోని మహద్ ప్రాంతానికి చెందిన ప్రాండ్యా అలియాస్ జ్యోతి సురేష్ను బంధువులు ఎగతాళి చేశారు. దీంతో విసుగు చెంది ఈ దారుణానికి పాల్పడింది. సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆమెకు రెండేళ్ల క్రితం పెళ్లయింది. ఆమె శరీరం రంగు బాగోలేదని, వంట కూడా సరిగా చేయడం రాదని బంధువులు ఆటపట్టించేవాళ్లు.
Maharashtra: Woman arrested & charged with attempt to murder in Raigad y'day after she mixed pesticide in food served at party hosted by her relative. Raigad SP Anil Paraskar says 'She confessed that she did this due to family dispute. 5 people have died & 120 have fallen ill.' pic.twitter.com/aGfrdEfCU2
— ANI (@ANI) June 23, 2018
అవి ఎక్కువ కావడంతో ఆమె విసుగు చెందింది. ప్రతీకారం కోసం ఎదురు చూసింది. మహాద్లోని తన సమీప బంధువైన సుభాష్మానే ఇంట్లో జరిగే వేడుకను అందుకు వేదికగా చేసుకుంది. అక్కడ కూడా ఆమెకు మిగతా బంధువుల ఎదుట అవమానం ఎదురైంది. దీంతో అసహనం చెందిన ఆమె అతిథులకు వడ్డించే భోజనంలో పురుగుల మందు కలిపింది. దీంతో భోజనం చేసిన వారందరూ ఒక్కొక్కరుగా అస్వస్థత పాలవుతుండటంతో వారందరినీ దగ్గర్లోని ఆసుపత్రుల్లో చేర్పించారు.
విషయం తెలియడంతో పోలీసులు రంగంలోకి దిగారు. భోజనం శాంపిల్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఆహారంలో పురుగుల మందు కలిపినట్లు గుర్తించారు. దీంతో వేడుకకు వచ్చిన బంధువులనందరినీ పోలీసులు ప్రశ్నించారు. ఈమె సమాధానాలు అనుమానంగా ఉండటంతో అదుపులోకి తీసుకొని విచారించగా, అసలు విషయం వెలుగు చూసింది.
దీనిపై రాయ్గఢ్ సూపరింటెండెంట్ అనిల్ పారస్కర్ మాట్లాడుతూ... ఆమె శరీరం రంగుపై వ్యాఖ్యలు చేస్తూ బంధువులు ఏడిపిస్తుండటంతో వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఈ పని చేసిందని, ఆమెలో పెరిగిన అసహనం కారణంగానే వాళ్లని చంపడానికి కూడా వెనుకాడలేదని, ఈ వేడుకలో పిల్లలున్నారని తెలిసి కూడా ఆమె లెక్కచేయలేదని, కుటుంబ కలహాలు, వైవాహిక జీవితంలో సమస్యలే ఈమెను ఈ దారుణానికి ఒడిగట్టేలా చేశాయని, విచారణ కొనసాగుతోందని తెలిపారు.