కాంగ్రెస్ అధ్యక్షుడిగా మళ్లీ రాహుల్ గాంధీ: ఢిల్లీ పార్టీ తీర్మానం, ఎక్కిడిదాకా వెళుతుందో?
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీని తక్షణమే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిని చేయాలని ఆ పార్టీ ఢిల్లీ యూనిట్ తీర్మానం చేసింది. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు తేదీలు ఖరారైన నేపథ్యంలో ఢిల్లీ కాంగ్రెస్ చర్య కీలక చర్చకు దారితీసింది. దీంతో రాహుల్ అధ్యక్ష ఎన్నిక అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
ఇక ఢిల్లీ కాంగ్రెస్ తరహాలోనే ఇతర రాష్ట్రాల శాఖలు కూడా ఇలాంటి తీర్మానాలు చేసే అవకాశాలను కల్పించింది. కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాత్మక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) ఇటీవలి భేటీలో ఎన్నికలను సంబంధించిన తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే, ఆ గడువు లోపే తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ వంటి కీలక రాష్ట్రాలకు ఎన్నికలు పూర్తికానున్నాయి. అధ్యక్ష ఎన్నిక ప్రక్రియను జాప్యం చేయడాన్ని పార్టీలోని ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సీడబ్ల్యూసీ సమావేశంలో, సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, ముకుల్ వాస్నిక్, పి చిదంబరం - పార్టీ నాయకత్వం, నిర్వహణపై అసౌకర్య ప్రశ్నలు వేసిన వారిలో ఉన్నారు. వెంటనే సంస్థాగత ఎన్నికలు కావాలని కోరారు. వారికి వ్యతిరేకంగా గాంధీ విధేయులు అని పిలువబడే.. ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లోట్, అమరీందర్ సింగ్, ఎకె ఆంటోనీ, తారిక్ అన్వర్, ఊమెన్ చాందీ - రాష్ట్రాల ఎన్నికల తరువాత దీనిని నిర్వహించాలని అన్నారు.
ఈ క్రమంలోనే ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు తీర్మానం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ అవుతారా? లేక ఇతరులెవరైనా ఆ బాధ్యలను తీసుకుంటారా? అనేది ఉత్కంఠగా మారింది.
2019లో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అవమానకరమైన ఓటమిని చవిచూసిన తరువాత పార్టీ చీఫ్ పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. తిరిగి బాధ్యతలు చేపట్టాలని అనేక పిలుపులు వచ్చినప్పటికీ విముఖత చూపారు. దీంతో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా రాహుల్ తల్లి సోనియా గాంధీ మరోసారి బాధ్యతలు చేపట్టారు.