పరువు పోతోంది: నటి లైంగిక వేధింపులపై శశిథరూర్ తీవ్ర స్పందన
ప్రముఖ మలయాళ నటిపై జరిగిన లైంగిక వేధింపుల ఘటనపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్రంగా స్పందించారు.
న్యూడిల్లీ: ప్రముఖ మలయాళ నటిపై జరిగిన లైంగిక వేధింపుల ఘటనపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్రంగా స్పందించారు. విద్యావంతుల రాష్ట్రంగా పేరు తెచ్చుకున్న కేరళ ఇప్పుడు విలువలు పోగొట్టుకొంటోందని ఆయన అన్నారు. కేరళలో నటిపై లైంగిక వేధింపుల ఘటనపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ఖండించారు.
తాజాగా ఈ విషయాన్ని ఉద్దేశించి శశి థరూర్ మీడియాతో మాట్లాడారు. 'ఇది దేశవ్యాప్తంగా ఉన్న సమస్య, ఇప్పుడు అదే కేరళలోనూ జరగడం బాధాకరం. మనది సాంస్కృతికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం, కాని మనం ఆ విలువలను, సంస్కృతిని పోగొట్టుకుంటున్నాం' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేగాక, ఇలాంటి సంఘటనల పట్ల మన దేశంలో స్పందన దారుణంగా ఉంటోందని, ప్రజలు బాధితురాలు సిగ్గుపడేలా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కారణంగానే చాలా మంది మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి ముందుకు రావడం లేదని, పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని అన్నారు.
'బాధిత నటి ధైర్యంగా ముందుకు రావడం ఎంతైనా అభినందించాలి. ఈ తప్పును సరిదిద్దండని చెప్పే ధైర్యం ఆమెకు ఉంది. ఈ నేరం చేసిన వాళ్లను అరెస్టు చేసి, శిక్షిస్తారని ఆశిస్తున్నా. తల్లిదండ్రులు పిల్లల్ని, ప్రత్యేకించి అబ్బాయిల్ని చదివించి, నైతిక విలువలు నేర్పించాలి. వాళ్లకి అమ్మాయిలు, మహిళల్ని గౌరవించడం నేర్పించాలి. వారి పట్ల ఇలా అసభ్యంగా ప్రవర్తించకూడదని చెప్పాల్సిన బాధ్యత వారిదే' అని శశి థరూర్ చెప్పారు.
రాష్ట్రంలో భద్రతా వ్యవస్థ మరింత దృఢంగా రూపుదిద్దుకోవాలని అన్నారు. శుక్రవారం రాత్రి దక్షిణాదిలో పలు సినిమాల్లో కథా నాయికగా నటించిన నటిని కిడ్నాప్ చేసి, కారులోనే రెండు గంటలపాటు తిప్పుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు ఏడుగురు దుర్మార్గులు. ఆ తర్వాత సుమారు రాత్రి 10.30గంటలకు ఆమె నివాసం సమీపంలో వదిలేశారు.