"నోట్ల రద్దు నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే.. మూడురోజుల్లో విశ్వరూపమే"
న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మూడు రోజుల తర్వాత విశ్వరూపం చూపిస్తామని ప్రతిపక్షాలన్ని కేంద్రానికి హెచ్చరికలు జారీ చేశాయి. పార్లమెంట్ ఉభయ సభల్లోను దీనిపై వాడివేడి చర్చ జరగ్గా.. ప్రతిపక్షాలన్ని ఈ చర్యను నిరసిస్తూ రోడ్డెక్కాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, సీపీఎం నేత సీతారాం ఏచూరి దీనిపై గట్టిగా పోరాడడానికి సన్నద్దమవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే నోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే.. మూడు రోజుల తర్వాత విశ్వరూపం చూపిస్తామని ప్రతిపక్షాలు కేంద్రాన్ని హెచ్చరించాయి. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద పడిగాపులు పడుతున్న జనంతో కలిసి ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తామని చెబుతున్నాయి. కాగా, నోట్ల రద్దు నిర్ణయాన్ని ఢిల్లీ, బెంగాల్ సీఎంలు వ్యతిరేకించగా.. బీహార్ సీఎం నితీశ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సమర్థించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ విషయంలో తటస్థ వైఖరిని అవలంభిస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. బీజేపీ మిత్రపక్షాలైన టీడీపీ దీన్ని సమర్థిస్తుండగా.. శివసేన మాత్రం వ్యతిరేక గళం వినిపిస్తోంది. మమతా, కేజ్రీవాల్ లాంటి సీఎంలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ.. ఇతర రాష్ట్రాల సీఎంల నుంచి అంతగా ఒత్తిడి లేకపోవడంతో.. దీనిపై మోడీ వెనక్కి తగ్గడం దాదాపు అసాధ్యమే.
అయితే వందనోట్లను ఎక్కువ స్థాయిలో అందుబాటులోకి తీసుకురాకపోవడం మాత్రం కేంద్రాన్ని విమర్శలపాలు చేస్తోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అందుబాటులోకి తీసుకురాకుండా నిర్ణయాన్ని ప్రకటించేయడంతో సామాన్య జనం నానా అవస్థలు పడుతున్నారు.












Click it and Unblock the Notifications