మోడీ పాలన ఎమర్జెన్సీ కంటే దారుణం... భూసేకరణ ఆర్డినెన్స్ను అమలు చేయం: మమతా బెనర్జీ
కోల్కత్తా: ప్రధాని నరేంద్రమోడీ పాలన 1970లో విధించిన ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన భూసేకరణ సవరణ ఆర్డినెన్స్ను రాష్ట్రంలో అమలు చేయమని తెలిపారు.
పాఠకుల కోసం ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
భూసేకరణ చట్టంలోని సవరణలను కేంద్ర మంత్రి వర్గం ఆమోదించడాన్ని నిరసిస్తూ ఆర్డినెన్స్ ప్రతులను తగలబెట్టాలని మమత బెనర్జీ ప్రజలకు పిలుపునిచ్చారు. భూసేకరణ చట్టం ద్వారా జాతీయ ప్రాజెక్టులకు భూసేకరణ చేసిన తర్వా ప్రభావిత కుటుంబాలకు ఎవరు ఆదుకోవాలని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఆరోపించారు. భూమి మీద ప్రజల హక్కులను కాలరాయడానికి ప్రభుత్వానికి ఎంత ధైర్యం అని అన్నారు. భూసేకరణ చట్టాలను తమ రాష్ట్రంలో అమలు చేయమని అన్నారు.
ఇక సోహ్రబుద్దీన్ కేసులో అమిత్ షాపై వచ్చిన అభియోగాలను సిబిఐ ప్రత్యేక న్యాయ స్థానం మంగళవారంనాడు తోసిపుచ్చింది. సిబిఐ పేర్కొన్న విషయాలను పూర్తిగా అంగీకరించడానికి వీలు లేదని, అమిత్ షాపై నిందితుడిగా అభియోగాలు మోపలేమని తన అభిప్రాయమని ప్రత్యేక న్యాయమూర్తి ఎంబి గోసావి అన్నారు.
ఈ కేసులో ఆయనకు ఊరట లభించడంపై మమతా బెనర్జీ స్పందిస్తూ... అమిత్షాపై 35 కేసులున్నాయి. ఆయనకు కోర్టు కేసుల్లో ఊరట కలిగించడాన్ని తృణమూల్ కాంగ్రెస్ ఖండిస్తుందని చెప్పారు. సీబీఐని ఉపయోగించి తనపై కేసులు నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు.
శారదా చిట్ ఫండ్ స్కాంలో సోమవారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ షానఖ్దేబ్ పండాని ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించింది. ఇప్పటికే ఈ స్కాంలో అభియోగాలను ఎదుర్కొంటూ తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కునాల్ ఘోష్, శ్రీన్జాయ్ బోస్ జైల్లో ఊచలు లెక్కపెడుతున్న విషయం తెలిసిందే. శారదా స్కాంలో మమతా హస్తం కూడా ఉందంటూ ఆరోపణలు వచ్చాయి.