తూచ్.. తూచ్... మమతపై దాడి జరగలేదు.. ఈసారి పరిశీలకుల రిపోర్ట్, ఈసీ చేతికి
నందిగ్రామ్లో ఏం జరిగిందనే అంశంపై ఈసీ ఆరాతీసింది. నిజ నిర్ధారణ కోసం ప్రత్యేక పరిశీలకులను నియమించింది. ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకులు వివేక్ దుబే, అజయ్ నాయక్ నందిగ్రామ్కు వెళ్లి ఆ రోజు ఏం జరిగిందనే అంశంపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడడంతోపాటు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాలను క్షుణ్ణంగా అధ్యయనం కూడా చేశారు. తర్వాత ఈసీకి నివేదిక సమర్పించారు.

దాడి చేయలే
మమతా బెనర్జీపై ఎవరూ దాడి చేయలేదని.. అది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన మాత్రమేనని ఎన్నికల సంఘం పరిశీలకులు తన నివేదికలో స్పష్టం చేశారు. ఆమెపై దాడి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. ఆ సమయంలో మమతా బెనర్జీ వెంట పోలీసులు కూడా ఉన్నారని తెలిపారు. అంతకుముందు బెంగాల్ చీఫ్ సెక్రటరీ ఆలాపన్ బందోపాధ్యాయ్ సమర్పించిన నివేదికపై ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది.

పిల్లర్కి తగిలి.. బలంగా మూసుకుని
కారు డోర్ను తెరిచి ఉంచి.. ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో.. కారు డోర్ ఓ పిల్లర్కి తగిలి, బలంగా మూసుకుందని తెలిపారు. అది బలంగా మూసుకోవడం వల్లే మమత కాలికి గాయాలయ్యాయని పేర్కొన్నారు. మమతా బెనర్జీ కోల్కతాలోని SSKM ఆస్పత్రిలో రెండురోజుల చికిత్స అనంతరం శుక్రవారం డిశ్చార్జి అయ్యారు. ఆమె ఎడమ కాలి మడిమ, చీలమండ దగ్గర తీవ్రమైన గాయం అయింది. ఎముకలో పగుళ్లు ఏర్పడ్డాయి. కుడి భుజం, కుడిచేతి మణికట్టుపై గాయాలు ఉన్నాయి. ఛాతీనొప్పితో ఆమె బాధపడుతున్నారు. ఆమెకు నెలన్నర నుంచి రెండు నెలల పాటు బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్లు తెలిపారు.

ఇదీ షెడ్యూల్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలయింది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీకి మార్చి-27 నుంచి ఏప్రిల్-29వరకు ఎనిమిది దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే-2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి












Click it and Unblock the Notifications