మన్మోహన్ అల్లుడికి కీలక పదవి కట్టబెట్టిన మోడీ..
న్యూఢిల్లీ : మన్మోహన్ సింగ్ అల్లుడు, ఐపీఎస్ అధికారి అశోక్ పట్నాయక్ కు నేషనల్ ఇంటలిజెన్స్ గ్రిడ్ (NATGRID)పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు ప్రధాని నరేంద్ర మోడీ. సీఈఓ గా ఆయనకు బాధ్యతలు అప్పగిస్తూ గురువారం నాడు ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం ఇంటలిజెన్స్ బ్యూరోకు అదనపు డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న అశోక్ పట్నాయక్ 1983 బ్యాచ్ కు చెందిన గుజరాత్ ఐపీఎస్ ఆఫీసర్. కాగా, నిఘా విభాగాలను పటిష్టపరిచే ఇంటలిజెన్స్ సంస్థలకు ఆయా ప్రభుత్వాల ఏజెన్సీలు, వివిధ శాఖలన్నింటిని కలుపుకుని మొత్తంగా దాదాపు 21 విభాగాల నుంచి ఆన్ లైన్ సమాచారాన్ని చేరవేయడంలో నాట్ గ్రిడ్ దే కీలక పాత్ర. ముంబైలో 26/11 దాడుల అనంతరం కేంద్రం నాట్ గ్రిడ్ కు జాతీయ ఆమోద ముద్ర వేసింది.
నాట్ గ్రిడ్ సీఈఓ గా అశోక్ పట్నాయక్ బాధ్యతలను డిసెంబర్ 31, 2018 వరకు కొనసాగించనుంది కేంద్రప్రభుత్వం. ఇదిలా ఉంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు స్వయాన అల్లుడైన అశోక్ పట్నాయక్, మన్మోహన్ రెండవ కూతురు దమన్ సింగ్ ను వివాహం చేసుకున్నారు. 1994 లో స్పెషల్ డ్యూటీ మెడల్, 1999 పోలీస్ మెడల్, 2007లో పోలీస్ ప్రెసిడెంట్ మెడల్ అందుకున్నారు అశోక్ పట్నాయక్.