ఆర్కే అంత్యక్రియలు పూర్తి.. ఫోటోలు విడుదల చేసిన మావోలు
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు ఆర్కే అంత్యక్రియల ముగిశాయి. దానికి సంబంధించిన ఫొటోలను మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. తెలంగాణ సరిహద్దు ప్రాంతం పామేడు-కొండపల్లి సరిహద్దు ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించినట్టు వెల్లడించింది. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు చేయగా, మావోయిస్టులు భారీగా హాజరయ్యారు. ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా ఉంచి నివాళులు అర్పించారు.
ఆర్కే అనారోగ్యంతో చనిపోయిన సంగతి తెలిసిందే. ఛత్తీస్గఢ్లోని దక్షిణ బస్తర్ అడవీ ప్రాంతంలో కన్నుమూశారని ఛత్తీస్గఢ్ పోలీసులు తెలిపారు. ఆయన చనిపోయారని అధికార ప్రతినిధి అభయ్ పేరుతో విడుదలైన ప్రకటనలో వెల్లడించారు. మావోయిస్టుల అది నాయకత్వంలో అగ్రగణ్యుడు ఆర్కే.. గెరిల్లా ఆర్మీ నిర్మాణంలో, శత్రువులపై దాడి చేయడంలో మాస్టర్ మైండ్గా ఆయనకు పేరుంది. ఆర్కేపై చాలా కేసులు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై అలిపిరి వద్ద దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నారు.
2004 అక్టోబర్ 15న అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చల్లో ఆర్కే మావోయిస్టుల తరఫున నాయకత్వం వహించారు. ఆర్కే ఏవోబీ కార్యదర్శిగా ఉన్న సమయంలో ఒడిశాలోని మల్కంగిరి, బలిమెల దండకారుణ్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆయన కుమారుడు మున్నా మరణించారు. వరంగల్ నిట్లో బీటెక్ పూర్తిచేసిన ఆర్కే.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.
ఆర్కే అసలు పేరు.. అక్కిరాజు హరగోపాల్. ఆర్కే మృతితో మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. మావోయిస్ట్ దళంలో వ్యూహంలో రచించడంలో రామకృష్ణ మంచి దిట్ట. పలుమార్లు పోలీసుల నుంచి తప్పుకున్న రామకృష్ణ.. అనారోగ్యంతో మృతి చెందారు. పలు ఎన్ కౌంటర్ల నుంచి తప్పించుకున్న ఆర్కేకు.. నాలుగేళ్ల క్రితం బలిమెలలో జరిగిన ఎన్ కౌంటర్ లో బుల్లెట్ గాయమయింది. అదే ఎన్ కౌంటర్ లో ఆయన కుమారుడు మృతి చెందాడు. బుల్లెట్ గాయమైనప్పటి నుంచి ఆర్కే అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆర్కే కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఇంతలోనే అనారోగ్యంతో చనిపోయాడు.