ఎస్పీతో పొత్తుపై త్వరలోనే ప్రకటన.. సీట్ల సర్దుబాటుపై చర్చలు: మాయావతి
లక్నో: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ పొత్తు ఉత్తరప్రదేశ్ లో బీజేపీని మట్టికరిపిస్తుందని ఆ పార్టీ వర్గాలు ధీమాతో ఉన్నాయి. ఇప్పటికైతే పొత్తు ఖరారు కాలేదు కానీ ఆ దిశగా చర్చలు మాత్రం సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తుపై బీఎస్పీ అధినేత్రి మాయావతి తాజాగా మీడియాతో మాట్లాడారు.
లోక్ సభ ఎన్నికల్లో సమాజ్ వాది పార్టీతో పొత్తు పెట్టుకునే అంశంపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేస్తామన్నారు మాయావతి. రెండుపార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై నిర్ణయం జరిగాక.. దానిపై ఒక ప్రకటన చేస్తామన్నారు మాయావతి. పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నందునా.. ఈ విషయంలో ఇప్పుడే తొందరపడాలనుకోవడం లేదన్నారు.
కర్ణాటక ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొనడం లేదన్న ప్రచారాన్ని ఆమె తోసిపుచ్చారు. కర్ణాటకలో జేడీ (యస్) తరఫున ప్రచారం చేసేందుకు తాను వెళ్లనున్నట్టు ఆమె తెలిపారు. కన్నడ ప్రజలు ఎవరూ ఊహించని తీర్పు ఇవ్వనున్నారని ఆమె జోస్యం చెప్పారు. కేంద్రంపై తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించే అవకాశం కర్ణాటక నుంచే మొదలవబోతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా, ఉత్తరప్రదేశ్ లోక్ సభ ఉపఎన్నికల్లో బీజేపీ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. బీఎస్పీ ఎస్పీకి మద్దతు తెలపడంతో బీజేపీకి ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలోనే ఈ పొత్తు మున్ముందు కూడా కొనసాగాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.