కేరళ: విదేశీ సాయం అంగీకరించబోమంటూ తేల్చేసిన విదేశాంగ శాఖ
న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు విదేశాలు సాయం చేస్తామని ముందుకొచ్చిన నేపథ్యంలో ఆ నిధులను తీసుకోవాలా? లేదా? అనే విషయంపై భారత విదేశాంగ శాఖ స్పష్టమైన ప్రకటన చేసింది. కేరళకు యూఏఈ రూ.700 కోట్ల సాయం అందిస్తామని తెలిపిన విషయం తెలిసిందే.
అయితే ఈ సాయాన్ని కేంద్రం తిరస్కరించనుందని వార్తలు కూడా వచ్చాయి. దీనిపై విదేశాంగ శాఖ స్పందించింది. ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం ప్రకారం.. విదేశీ సాయాన్ని అంగీకరించబోమని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ వెల్లడించారు.
దేశీయ ప్రయత్నాల ద్వారానే కేరళ రాష్ట్రాన్ని పునరిద్ధరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కేరళకు యూఏఈ రూ.700కోట్లు, ఖతార్ రూ.35కోట్లు, మాల్దీవులు రూ.35లక్షల సాయాన్ని ప్రకటించాయి. భారత ప్రభుత్వం ఆయా దేశాల ఉదారత్వానికి ధన్యవాదాలు తెలిపింది. కానీ, వాటిని అంగీకరించమని వెల్లడించింది.
ప్రధాన మంత్రి సహాయ నిధికి, కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎన్ఆర్ఐలు, అంతర్జాతీయ ఫౌండేషన్లు, సంస్థలు సహాయం చేయొచ్చని రవీష్ కుమార్ వెల్లడించారు. కాగా, కేంద్రం నిర్ణయంతో కేరళ వాసులు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం పినరయి విజయన్ కూడా యూఏఈ సహాయాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని మోడీని కలిసి విదేశీ సాయం అందుకోవడంలో ఉన్న అడ్డంకులను తొలగించాలని కోరతామని విజయన్ తెలిపారు. కేరళలో దాదాపు 15రోజుల పాటు కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. 357మంది చనిపోగా, దాదాపు రూ.20వేల కోట్ల నష్టం వాటిల్లిందని విజయన్ తెలిపారు. విదేశాలు ఇచ్చే సాయాన్ని తిరస్కరిస్తే కేంద్రమే.. అంతకుమించిన సాయాన్ని ప్రకటించాలని పలువురు కేరళ మంత్రులు డిమాండ్ చేస్తున్నారు.