బీజేపీపైనే ఆధారం..!!
ఈశాన్య రాష్ట్రం మేఘాలయాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు కనిపిస్తోన్నాయి. నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ ను అందుకోలేకపోతుంది.
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయా, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కిందటి నెల 16వ తేదీన త్రిపుర, 27వ తేదీన మేఘాలయా, నాగాలాండ్ అసెంబ్లీ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇవ్వాళ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ తో ఓట్ల లెక్కింపు ఆరంభమైంది. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ తన పట్టును నిలుపుకొన్నట్టే.
మేఘాలయాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అధికార నేషనల్ పీపుల్స్ పార్టీకి పూర్తి మెజారిటీ దక్కేలా కనిపించట్లేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిిగర్.. 31 కాగా దీన్ని ఎన్పీపీ అందుకునేలా లేదు. 27 స్థానాల వద్ద దాని ప్రస్థానం ఆగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. 27 స్థానాలతో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించనుంది. అధికారంలోకి రావడానికి మరో పార్టీతో పొత్తు అనివార్యంగా కనిపిస్తోంది మేఘాలయాలో.

హంగ్ అసెంబ్లీ అంటూ ఏర్పడితే బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశాన్ని పరిశీలిస్తామంటూ నేషనల్ పీపుల్స్ పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి కొర్నాడ్ కే సంగ్మా ఇదివరకే సంకేతాలను ఇచ్చారు. ఈ క్రమంలో ఎన్పీపీ- భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి అయిదు స్థానాలు దక్కాయి. ఎన్పీపీకి ఇప్పుడున్న 27 సీట్లకు అయిదు సీట్లను సాధించిన బీజేపీ మద్దతు ప్రకటిస్తే- సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమౌతుంది.
తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ అయిదు చొప్పున స్థానాలను దక్కించుకున్నాయి. యూడీపీ ఎనిమిది నియోజకవర్గాలకే పరిమితం కావడం దాదాపుగా ఖాయమైనట్టే. ఇతరులు 10 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నారు. కాగా- నాగాలాండ్ లో బీజేపీ-నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ) ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ కూటమి- పూర్తిస్థాయి మెజారిటీని సాధించింది. ఈ రెండు పార్టీలకూ 40 స్థానాలు దక్కాయి. ఇతరులు 17 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ రెండుచోట్లకే పరిమితమైంది.












Click it and Unblock the Notifications