గల్వాన్ లోయలో మైనర్ ఫేస్-ఆఫ్: వెంటనే వెళ్లిపోయిన భారత్-చైనా బలగాలు
న్యూఢిల్లీ: ప్రపంచమంతా చైనా పుట్టిన కరోనాతో పోరాడుతుంటే.. మన భద్రతా దళాలు మాత్రం కరోనా మహమ్మారితోపాటు దాని పుట్టినిల్లు అయిన చైనాతోనూ పోరాడుతోంది. గత సంవత్సరం నుంచి సరిహద్దుల్లో కుట్రలు పన్నుతున్న చైనా.. మరోసారి కయ్యానికి కాలుదువ్వుతున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
తాజాగా, నో పెట్రోలింగ్ జోన్ అయిన తూర్పు లడఖ్లోని గల్వాన్ లోయలో చైనా బలగాలు కవ్వింపు చర్యలకు దిగడంతో భారత దళాలు కూడా తగిన సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. పలు జాతీయ మీడియాలు ఈ మేరకు కథనాలను ప్రసారం చేస్తున్నాయి. మే మొదటి వారంలో ఈ ఘటనలు చేసుకున్నట్లు సమాచారం.

అయితే, రెండు దేశాల బలగాలు ఎదురుపడినప్పటికీ ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోలేదని, వెంటనే అక్కడ్నుంచి వెళ్లిపోయారని ఓ ప్రభుత్వ సీనియర్ అధికారి 'ది హిందూ' తెలిపారు. గత సంవత్సరం ఘర్షణల అనంతరం నో పెట్రోలింగ్ జోన్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడికి ఇరుదేశాల బలగాలు వెళ్లకూడదు.
ఈ క్రమంలో రెండు దేశాల బలగాలు అప్పుడప్పుడు ఎవరైనా సంచరిస్తున్నారా? అనే విషయాన్ని గమనించేందుకు వస్తూ ఉంటారు. ఇలా ఇరు దేశాలు వేర్వేరు సమయాల్లో తనిఖీ చేస్తుంటారు. కానీ, ఆ రోజు మాత్రం రెండు దేశాల బలగాలు ఒకే సమయంలో రావడంతో చిన్నపాటి ముఖాముఖి ఏర్పడిందని సదరు అధికారి వెల్లడించారు. ఆ తర్వాత ఇరు దేశాల దళాలు వెంటనే అక్కడ్నుంచి వెళ్లిపోయాయని చెప్పారు.
అయితే, నో పెట్రోల్ జోన్లకు సమీపంలోనే చైనా దళాలు క్యాంపులు ఏర్పాటు చేసుకున్నాయని తెలిపారు. భారత భద్రతా బలగాలు చైనా కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాయని చెప్పారు. భారత్ ఒక అంగుళం కూడా తన భూభాగాన్ని కోల్పోలేదని, కోల్పోదని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ శనివారమే స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications