బీహార్లో అమ్మాయిపై గ్యాంగ్ రేప్, ఆ తర్వాత హత్య
ఖంగారియా: బీహార్లో ఓ 12 ఏళ్ల అమ్మాయిపై దండగులు సామూహిక అత్యాచారం జరిపి, ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలోని ఖంగారియా జిల్లాలోని ఓ గ్రామంలో జరిగినట్లు పోలీసులు మంగళవారంనాడు వెల్లడించారు. ఆరో తరగతి చదువుతున్న అమ్మాయి నిన్నటి నుంచి కనిపించకుండా పోయిందని, చివరికి రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆమె శవం కనిపించిందని ఖంగారియా పోలీసు సూపరింటిండెంట్ ధురత్ సాయ్లి సబ్లారామ్ చెప్పారు.
అమ్మాయి శవం కనిపించిన నేపథ్యంలో సంఘటన జరిగిన రతన్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణలను నివారించడానికి, శాంతి భద్రతలను పరిరక్షించడానికి 144 సెక్షన్ కింద నిషేదాజ్ఞలు విధించినట్లు ఎస్పీ చెప్పారు.
రాష్ట్ర రాజధాని పాట్నాకు తూర్పున 175 కిలోమీటర్ల దూరంలో ఆ గ్రామం ఉంది. బాలికపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను హత్య చేశారని సబ్లారామ్ చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు, ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.
ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించినట్లు, ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉన్నట్లు ఆయన తెలిపారు మత సామరస్యాన్ని కాపాడాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పుకార్లను నమ్మవద్దని కూడా ఆయన కోరారు. నిందితులందరినీ అరెస్టు చేస్తామని, తాము అది పనిలో ఉన్నామని ఎస్పీ చెప్పారు.