కదులుతున్న బస్సులో బాలికపై గ్యాంగ్రేప్
గౌహతి: అస్సాం రాష్ట్రంలోని బాస్కా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న బస్సులో మైనర్ బాలికపై డ్రైవర్, అతని సహాయకుడు అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఘటన వివరాలిలా ఉన్నాయి. గత ఆదివారం గోరేశ్వర్ వెళ్లడానికి సోనిత్పూర్ జిల్లా కేంద్రమైన తేజ్పూర్లో బస్సు ఎక్కిన బాలికను డ్రైవర్, సహాయకుడు గోరేశ్వర్ దాటాక కదులుతున్న బస్సులోనే అత్యాచారానికి పాల్పడ్డారు.
అనంతరం ఆత్రిఘాట్లో బస్సును ఆపారు. అక్కడి నుంచి తప్పించుకున్న బాలిక ఆత్రిఘాట్ సమీపంలోని ఆదివాసీ గ్రామానికి చేరుకుంది. అక్కడ అస్సాం ఆదివాసీల విద్యార్థి సంఘం నాయకులను కలిసి జరిగిన దారుణాన్ని వివరించింది.
ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థి సంఘం నాయకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా, పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లగా నిందితులు అక్కడ్నుంచి పారిపోయారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు.