ఆహ్వానించే ఛాన్స్ మిస్, బాధాకరం: అఖిలేష్, సౌదీకి ఒబామా
లక్నో: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఆహ్వానించే అవకాశం కోల్పోయామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందు కోసం మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన ఒబామా.. మంగళవారం తాజ్మహల్ను సందర్శించాల్సి ఉంది.
అయితే ఆ తర్వాత గురువారం సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా కన్నుమూయడంతో ఒబామా ఆగ్రా పర్యటను రద్దయ్యింది. ఒబామా పర్యటన రద్దు కావడంతో అఖిలేష్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆగ్రా పర్యటనకు వచ్చివుంటే స్వాగతం పలికే అవకాశం తమకు లభించివుండేదని తెలిపారు.

‘అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను రాష్ట్రానికి ఆహ్వానించే గొప్ప అవకాశం కోల్పోయాం. ఇది నిజంగా బాధాకరం. ప్రపంచంలోని రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలు స్నేహ సంబంధాలు కొనసాగించడం మంచి పరిణామం' అని సిఎం అఖిలేష్ యాదవ్ తన ట్విట్టర్, ఫేస్బుక్ ఖాతాల్లో పేర్కొన్నారు.
కాగా, సోమవారం బరాక్ ఒబామా దంపతులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన విందుకు పలువురు ప్రముఖలకు ఆహ్వానం అందింది. ఆహ్వానం అందుకున్న అఖిలేష్ యాదవ్ కూడా ఈ విందుకు హాజరయ్యారు.
ఇది ఇలా ఉండగా భారత్లో మూడు రోజుల పర్యటనను విజయవంతంగా ముగించుకున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఢిల్లీ నుంచి సౌదీ అరేబియాకు పయనమయ్యారు. పాలం ఎయిర్బేస్లో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్, పలువురు ఉన్నతాధికారులు ఒబామా దంపతులకు వీడ్కోలు పలికారు.
ఒబామాకు మోడీ వీడ్కోలు సందేశం
ఒబామా పర్యటన ముగిసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఓ ట్వీట్ చేశారు. ఒబామా సౌదీ అరేబియాకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో మోడీ ట్వీట్ చేశారు. విష్ యు ఏ సేఫ్ జర్నీ అని ట్వీట్ చేశారు. అలాగే, ఇరు దేశాల మధ్య కొత్త సంబంధాలు ఏర్పడ్డాయని, ఒబామా పర్యటన కొత్త అధ్యాయానికి తెరలేపిందని పేర్కొన్నారు. మోడీ ట్వీట్ చేసిన కొద్ది సమయంలోనే వేలాది మంది రీట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications