శశికళ రాజకీయ వేధింపుల వాస్తవాలు: పన్నీర్ సెల్వం, రౌడీషీటర్లు !
శశికళ కుటుంబ రాజకీయ వేధింపులు వాస్తవాలన్నీ తన మదిలోనే పాతిపెట్టేశానని, చిన్నమ్మ బండారం మొత్తం బయటపెడుతానని అన్నాడీఎంకే రెబల్ నాయకుడు పన్నీర్ సెల్వం తీవ్రస్థాయిలో హెచ్చరిస్తూ బాంబు పేల్చారు.
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్మేలు, ఎంపీల నాయకుడు పన్నీర్ సెల్వం త్వరలో చిన్నమ్మ శశికళకు ఝలక్ ఇవ్వడానికి సిద్దం అయ్యారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల తరువాత శశికళ బండారం మొత్తం బయటపెడుతానని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
శశికళ కుటుంబ రాజకీయ వేధింపులు వాస్తవాలన్నీ తన మదిలోనే పాతిపెట్టేశానని, ఇప్పుడు తాను బయటకు చెప్పింది 10 శాతం మాత్రమే అని, మిగిలిన 90 శాతం తాను పడ్డ బాధలు సొంత కథ అంటూ చెన్నైలో మీడియాకు చెప్పిన పన్నీర్ సెల్వం సస్పెన్స్ లో పెట్టారు.
కుటుంబ రాజకీయాలను అమ్మ ప్రోత్సహించలేదు
అన్నాడీఎంకే పార్టీలో కుటుంబ రాజకీయాల్ని అమ్మ జయలలిత ఎన్నడూ ప్రోత్సహించలేదని పన్నీర్ సెల్వం అన్నారు. ఆరోగ్యకర వాతావరణంలో పార్టీలో, ప్రభుత్వంలో ఉండాలన్నదే అమ్మ అభిమతం అని పేర్కొన్నారు. అలాంటిది ఈ రోజు పరిస్థితి చూస్తూంటే శశికళను అమ్మ ఆత్మ క్షమించదని పన్నీర్ సెల్వం చెప్పారు.
జయలలిత మరణంతో శశికళ అసలు రంగు !
జయలలిత మరణించిన వెంటనే శశికళ పార్టీ పదవి మీద దృష్టి పెట్టడం, తదుపరి ప్రభుత్వాన్ని గుప్పెట్లోకి తీసుకునే ప్రయత్నం చేశారని పన్నీర్ సెల్వం మండిపడ్డారు. అమ్మ అభిమతానికి వ్యతిరేకంగా చర్యలు సాగుతుండటంతోనే తాను తిరుగుబాటు చేసి బయటకు వచ్చానని ఆయన వివరించారు.
నిజాలు బయటకురావాలని
జయలలిత మరణం వెనుక దాగి ఉన్న అన్ని నిజాలు బయటకురావాలనే న్యాయ విచారణకు పట్టుబట్టడం జరిగిందని పన్నీర్ సెల్వం అన్నారు. మొత్తం మీద పన్నీర్ సెల్వం తన మనసులో పాతి పెట్టిన 90 శాతం వాస్తవాలు ఎప్పుడు బయటపెడుతారో ? అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
టార్గెట్ స్టాలిన్
అమ్మ మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ సంచలనం రేపిన పన్నీర్ సెల్వం పది శాతం వివరాలు మాత్రమే బయటకు చెప్పానని అంటున్నారని, మిగిలిన 90 శాతం వివరాలు చెప్పడానికి భయం ఎందుకో అని ఆర్ కే నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నాయకుడు ఎంకే. స్టాలిన్ నిలదీశారు. తాను కేవలం సీఎంగానే పని చేశానని, సొంత నిర్ణయాలు తీసుకోలేదనే విషయం స్టాలిన్ గుర్తుపెట్టుకోవాలని పన్నీర్ సెల్వం స్టాలిన్ ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు.
మాకు ప్రత్యర్థి అనే మాటే లేదు
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో మాకు ప్రత్యర్థే లేరని, మధుసూదనన్ గెలిచినట్లే అని పన్నీర్ సెల్వం ధీమా వ్యక్తం చేశారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికలో ఓడిపోతాం అనే భయంతోనే స్టాలిన్ తనను టార్గెట్ చేసుకుని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. అయితే పన్నీర్ సెల్వంకు భిన్నంగా ఆయన శిభిరంలోని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పాండియరాజన్ మాట్లాడుతూ ఆర్ కే నగర్ లో మాకు ప్రత్యర్థి డీఎంకే అంటూ స్పందించి ఆందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు.
త్వరలో ‘పన్నీర్'అమ్మ చానల్
తమిళనాడులో పెద్ద పార్టీలకే కాదు చిన్న చిన్న పార్టీలకు కూడా సొంతంగా టీవీ చానళ్లు ఉన్నాయి. ప్రస్తుతం తమకు కూడా ఓ టీవీ చానల్ అవసరం అని పన్నీర్ సెల్వం వర్గం గుర్తించింది. ఆర్ కే నగర్ ఫలితాల అనంతరం అమ్మ చానల్ ఏర్పాట్లకు కసరత్తులు జరుగుతున్నాయి. సుంగంబాక్కంలో కార్యాలయం ఏర్పాటు చెయ్యడానికి కసరత్తులు చేపట్టారు.
రౌడీషీటర్ల టార్గెట్
ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు సవ్యంగా జరగాలని నిర్ణయించిన అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకూ 35 మంది పేరుమోసిన రౌడీషీటర్లను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. చెన్నైలో తప్పించుకు తిరుగుతున్న రౌడీషీటర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.