చెన్నైలో కురుణానిధి ఇంటికి ప్రధాని మోడీ: ఒక్క రోజులో షాక్ ఇచ్చిన ఫ్యామిలీ, బ్లాక్ డే !
ప్రధాని నరేంద్ర మోడీ చెన్నై పర్యటన సందర్బంగా గోపాలపురంలోని డీఎంకే చీఫ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే.
చెన్నై: ప్రధాని నరేంద్ర మోడీ చెన్నై పర్యటన సందర్బంగా గోపాలపురంలోని డీఎంకే చీఫ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. దాదాపు 20 నిమిషాలు ప్రధాని మోడీ ఎం. కరుణానిధి ఇంటిలో గడిపారు. కరుణానిధిని పరామర్శించిన మోడీ ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు.
కరుణానిధి కుటుంబ సభ్యులు అందర్నీ మోడీ పలకరించారు. మోడీ తన ఇంటికి వచ్చి వెళ్లి రెండు రోజులు కూడా పూర్తి కాకముందే డీఎంకే పార్టీ చీఫ్ ఎం. కరుణానిధి కుమారుడు ఎంకే. స్టాలిన్ ప్రధానికి షాక్ ఇవ్వడానికి సిద్దం అయ్యారు. పెద్దనోట్లు రద్దు అయ్యి సంవత్సరం పూర్తి అయిన సందర్బంగా డిమానిటైజేషన్ పై నిరసన వ్యక్తం చెయ్యాలని డీఎంకే పార్టీ నిర్ణయించింది.
నవంబర్ 8వ తేదీన బ్లాక్ డే నిర్వహించాలని డీఎంకే పార్టీ నిర్ణయించింది. తన మిత్ర పక్షం కాంగ్రెస్ తదితర పార్టీలతో కలిసి బుధవారం తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చెయ్యాలని నిర్ణయించారు. దక్షిణ తమిళనాడులోని మధురైలో ఎంకే. స్టాలిన్ ధర్నాకు నేతృత్వం వహించనున్నారు.
డీఎంకే పార్టీ సీనియర్ నాయకులు దురై మురుగన్ తిరుచునాపల్లిలో, దిండిగల్ లో పెరియసామి ధర్నాకు నేతృత్వం వహించనున్నారు. ఎం. కురుణానిధి కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమోళిని కోయంబత్తూరులో జరిగే ధర్నాకు నేతృత్వం వహించనున్నారు. ప్రతి ఒక్కరూ నల్ల చోక్కలు వేసుకుని వచ్చి కరుప్పు దినం ( బ్లాక్ డే )లో పాల్గొనాలని డీఎంకే, కాంగ్రెస్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు.