ట్విటర్లో విమర్శలు తొలగిస్తే సరిపోతుందా.. కరోనా కట్టడిలో మోడీ ప్రభుత్వం విఫలం: లాన్సెట్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కరోనావైరస్ను కట్టడి చేసే పనిమానేసి ట్విటర్లో వస్తున్న విమర్శలను డిలీట్ చేసే పనిపై దృష్టిసారించిందంటూ ఘాటు పదాలతో మెడికల్ జర్నల్ లాన్సెట్ ఓ ఎడిటోరియల్ను ప్రచురించింది. కరోనావైరస్ విజృంభిస్తున్న వేళ మోడీ సర్కార్ పై వస్తున్న విమర్శలపై చర్చకు తెరదీస్తోందని ఈ సంక్షోభం సమయంలో అలాంటి వాటికి చోటివ్వకూడదని లాన్సెట్ అభిప్రాయపడింది. అంతేకాదు ప్రస్తుత పరిస్థితిని అదుపుచేయలేకపోతే భారత్లో ఆగష్టు 1వ తేదీ నాటికి 10 లక్షల మరణాలు నమోదవుతాయని హెచ్చరించింది. ఒక వేళ అదే జరిగితే ఈ జాతీయ విపత్తుకు బాధ్యత మోడీ ప్రభుత్వమే వహించాల్సి ఉంటుందని లాన్సెట్ పేర్కొంది.
Recommended Video
ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ..
కుంభమేళ ఇతర బహిరంగసభలతో కరోనా మహమ్మారి విజృంభించే అవకాశం ఉందని ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోలేదని ఘాటు విమర్శలు చేసింది లాన్సెట్. పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడుతారని తెలిసి కూడా ఎలాంటి కోవిడ్ నిబంధనలు పాటించకుండా ప్రభుత్వం ముందుకెళ్లి అనుమతి ఇచ్చిందని లాన్సెట్ వెల్లడించింది. ఇక భారత్లో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిందని చెబుతూనే ఈ సంక్షోభంను ఎదుర్కోవడంలో భారత ప్రభుత్వం విఫలమైందని కడిగిపారేసింది.
అజాగ్రత్తే కొంప ముంచింది
భారత్లో ప్రస్తుతం కరోనా వెతలు వర్ణించడం చాలా కష్టమని పేర్కొన్న లాన్సెట్... ఏ హాస్పిటల్ చూసినా కరోనా పేషెంట్లతో నిండిపోయిందని పేర్కొంది. హెల్త్ వర్కర్లు కూడా సేవలు చేసి అలసిపోగా.. చాలామంది కోవిడ్ బారిన పడ్డారని పేర్కొంది. ఇక సోషల్ మీడియా చూస్తే చాలు.. ఆక్సిజన్ కోసం పేషెంట్లు, డాక్టర్లు చేతులెత్తి నమస్కరిస్తూ వేడుకుంటున్నారని వెల్లడించింది. దేశంలో కోవిడ్-19 కథ ముగుస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ఈ ఏడాది మార్చిలో ప్రకటించారు. కానీ మార్చి నెలలోనే సెకండ్ వేవ్కు బీజం పడింది. గత కొన్ని నెలలుగా కరోనా కేసులు అతల్పంగా నమోదు కావడంతో భారత్లో కరోనా కథ ముగిసిందని ప్రభుత్వం భావించింది. అప్పటికే అజాగ్రత్తతో ఉండకూడదని సెకండ్ వేవ్ వస్తుందనే హెచ్చరికలు కూడా ఉన్నాయని లాన్సెట్ వెల్లడించింది.
ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించిన తప్పుడు నివేదికలు
ఇక భారత్లో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసిందని చాలా నివేదికలు తప్పుడు సమాచారం ఇచ్చి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించాయని లాన్సెట్ పేర్కొంది. అయితే జనవరిలో జరిగిన సీరో సర్వేలో కేవలం 21 శాతం మందిలో మాత్రమే కోవిడ్ యాంటిబాడీస్ ఉన్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పేర్కొంది. కోవిడ్ -19ను నియంత్రించడంలో ప్రారంభంలో భారత్ సక్సెస్ అయిందని అయితే ఆ తర్వాత కోవిడ్ -19 టాస్క్ఫోర్స్ కొన్ని నెలలుగా సమావేశం కాలేదని లాన్సెట్ విమర్శించింది. ఇక భారత్లో కరోనా టీకా కార్యక్రమం కూడ పలు విమర్శలను ఎదుర్కొంది. భారత్లో ఇక కరోనా కథ ముగిసిందన్న తప్పుడు సమాచారం కూడా టీకా కార్యక్రమం ప్రభావం చూపిందని అందుకే వ్యాక్సినేషన్ కార్యక్రమం చాలా మందకొడిగా సాగుతోందని లాన్సెట్ దుమ్మెత్తి పోసింది. వ్యాక్సిన్పై ప్రభుత్వం పలు గందరగోళాన్ని ప్రజల్లో సృష్టించిందని లాన్సెట్ కథనం పేర్కొంది.
ఒడిషా కేరళ రాష్ట్రాల ముందస్తు జాగ్రత్త
మహారాష్ట్ర ఉత్తర్ ప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో ఒక్కసారిగా కేసులు పెరగడంతో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. హాస్పిటల్లో పడకలు దొరకని పరిస్థితి నెలకొంది. ఇక స్మశానవాటికలైతే కరోనా మృతదేహాలతో నిండిపోయాయి.అయితే ఒడిషా, కేరళలాంటి రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో చాలా వరకు ఆక్సిజన్ను ఉత్పత్తి చేసుకునే సామర్థ్యంకు చేరుకున్నాయి. సెకండ్ వేవ్పై అవగాహన ఉండటంతో ఈ ముందస్తు జాగ్రత్తలు ఈ రాష్ట్రాలు తీసుకున్నట్లు లాన్సెట్ పేర్కొంది. ఇక నైనా ప్రభుత్వం మేల్కొని, ఈ సంక్షోభం మరింత ముదరకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని లాన్సెట్ సూచించింది. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని తిరిగి ఆరోగ్య వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించింది.
వ్యాక్సిన్ గ్రామీణ ప్రాంతాలకు చేరాలి
ముందుగా వ్యాక్సిన్ కార్యక్రమం వేగవంతం చేయాలని సూచించింది. వ్యాక్సిన్ పట్టణప్రాంతాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు కూడా చేరేందుకు ఒక సరఫరా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లాన్సెట్ సలహా ఇచ్చింది. ఎందుకంటే 60శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతంలోనే నివసిస్తుంటారని పేర్కొంది. వారికి వైద్య సదుపాయాలు తక్కువగా ఉంటాయి కాబట్టి ముందుగా వారిని పట్టించుకోవాలని లాన్సెట్ పేర్కొంది.ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో ఉండే హెల్త్ కేర్ సెంటర్లతో చర్చలు జరిపి వారి అవసరాలకు తగ్గట్టుగా వ్యాక్సిన్ను సరఫరా చేయాలని పేర్కొంది. అదే సమయంలో ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని ఒకవేళ లోటుపాట్లు ఏమైనా ఉంటే వాటిని వెంటనే పరిష్కరించే దిశగా అడుగులు వేస్తే కొంతవరకైనా మెరుగైన ఫలితాలు వస్తాయని సూచించింది. మరోవైపు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తే కరోనా కేసులు తిరిగి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని లాన్సెట్ తన ఎడిటోరియల్లో రాసుకొచ్చింది.