పంచలోహాలతో ఈశ్వర చంద్ర విగ్రహం.. కూల్చిన చోటనే ప్రతిష్టిస్తామన్న మోడీ
బెంగాల్లో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని నరేంద్రమోడీ ఆందోళన వ్యక్తం చేశారు. దీదీ హయాంలో రాష్ట్రంలో హింస పెచ్చుమీరిపోయిందని ఆరోపించారు. చివరి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీ మావులో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన.. మమత సర్కారుపై నిప్పులు చెరిగారు. బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా రోడ్ షో సందర్భంగా టీఎంసీ కార్యకర్తలు విధ్వంసానికి తెగబడ్డారని విమర్శించారు. బెంగాలీ విద్యావేత్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని కూల్చివేయడంపై మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. కూల్చిన స్థానంలోనే ఈశ్వరచంద్ర పంచలోహ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
బెంగాల్లో చివరి రోజు పోటాపోటీ ప్రచారం... మమత నియంతృత్వంపై మోడీ ఆగ్రహం..
కోల్కతాలో ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మోడీ డిమాండ్ చేశారు. బెంగాల్లో హింసకు మమత బెనర్జీయే కారణమని అన్నారు. ఇవాళ సాయంత్రం డుమ్ డుమ్లో జరగబోయే సభను కూడా మమత అడ్డుకుంటుందని ఆరోపించారు. ఈశ్వర చంద్ర విజన్కు తాము కట్టుబడి ఉన్నట్లు మోడీ స్ఫష్టం చేశారు.
మోడీ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ మండిపడింది. ఆయన చేసిన ప్రకటనపై టీఎంసీ నేత డెరిక్ ఒబ్రెయిన్ ట్విట్టర్లో స్పందించారు. మోడీ అబద్దాలకోరు అంటూ ట్వీట్ చేశారు.
మంగళవారం కోల్కతాలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీ సందర్భంగా అల్లర్లు చెలరేగాయి. విద్యాసాగర్ కాలేజీలో ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఇందుకు కారకులు మీరంటే మీరంటూ బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు పరస్పర విమర్శలకు దిగాయి. బెంగాల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఎన్నికల సంఘం చివరి దశ ఎన్నికల ప్రచారాన్ని కుదించింది. గురువారం రాత్రి 10గంటల్లోపు ప్రచారం ముగించాలని ఆదేశాలు జారీ చేసింది.