తగ్గుతున్న మోడీ ఇమేజ్: డిగ్గీ, నితీష్ ఘాటు వ్యాఖ్య
న్యూఢిల్లీ/పాట్నా/హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్ దిగజారుతోందని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సోమవారం అన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాల ద్వారా మోడీ ఇమేజ్ తగ్గుతోందని అర్థమవుతోందన్నారు. ఉప ఎన్నికల ఫలితాలే మంచి ఉదాహరణ అన్నారు.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, జేడీయు సీనియర్ నేత నితీష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలు విభజన రాజకీయాలను ఆమోదించడం లేదని ఉప ఎన్నికల ద్వారా అర్థమైందని ఘాటుగా స్పందించారు.
కాగా, నాలుగు రాష్ట్రాలలోని పద్దెనిమిది అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉపఎన్నికల్లో బిజెపికి ఎదురుదెబ్బ తగిలింది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సీట్లు పెరిగితే బిజెపి సీట్లు తగ్గాయి. 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బిజెపి ఏడు, కాంగ్రెస్ ఐదు, ఆర్జెడి, జెడియు కూటమి ఐదు, అకాలీదళ్ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. బీహార్, మధ్యప్రదేశ్, పంజాబ్, కర్నాటక రాష్ట్రాలలోని 18 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి.
బీహార్లో 10 అసెంబ్లీ సీట్లకుగాను బిజెపి కేవలం నాలుగు స్థానాలే గెలుచుకుని రెండు స్థానాలు కోల్పోయింది. మిగతా ఆరు స్థానాలు ఆర్జెడి, జెడియు, కాంగ్రెస్ పార్టీలు దక్కించుకున్నాయి. కర్నాటకలో కాంగ్రెస్ రెండు సీట్లు గెలిస్తే బిజెపి ఒక్క సీటుతో సంతృప్తి పడాల్సి వచ్చింది. పంజాబ్లో ఉప ఎన్నికలు జరిగిన రెండు సీట్లలో ఒక సీటును కాంగ్రెస్ నిలబెట్టుకుంటే రెండోదాన్ని అకాలీదళ్, బిజెపి కూటమి గెలుచుకుంది.