వీడియో: ఆ ఘటనపై ప్రశ్నించిన పాపానికి జర్నలిస్ట్పై బూతులతో విరుచుకుపడ్డ కేంద్రమంత్రి
లక్నో: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనడానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సమాయాత్తమౌతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా కోట్లాది రూపాయల విలువ చేసే ప్రాజెక్టులను ఉత్తర ప్రదేశ్కు కేటాయిస్తోంది. నిధులను గుమ్మరిస్తోంది. 408 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశ్లో వరుసగా రెండోసారి అధికారాన్ని అందుకుంటామని, 350 సీట్లను సాధించుకుంటామంటూ యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేస్తోన్నారు.
ఈ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోరుకు సడన్ బ్రేకులు వేస్తోంది లఖింపూర్ ఖేరి ఉదంతం. మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా లఖింపూర్ ఖేరీలో నిరసన ప్రదర్శనలను చేపట్టిన రైతులపై కేంద్ర హోం శాఖ సహాయమంత్రి, స్థానిక లోక్సభ సభ్యుడు అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు కారును పోనిచ్చిన ఉదంతం అది. ఈ ఘటన నివురు గప్పిన నిప్పులా ఉంటూ వస్తోంది. ఈ ఘటనలో అజయ్ మిశ్రా కుమారుడు ఆశీష్ అరెస్టయ్యారు.
ఆయనే ప్రధాన నిందితుడు. విచారణ కొనసాగుతోంది. దీనికోసం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఈ ఘటనలో ఎనిమింది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ గురించి ఆరా తీయడానికి ప్రయత్నించిన ఓ టీవీ జర్నలిస్టుకు చేదు అనుభవం ఎదురైంది. కేంద్రమంత్రితో బూతులు తిట్టించుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
లఖింపూర్ ఖేరీలో ఈ తాజాగా ఘటన చోటు చేసుకుంది. ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో అజయ్ కుమార్ మిశ్రా లఖింపూర్ ఖేరీలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇది ఆయన సొంత లోక్సభ నియోజకవర్గం. ఈ సందర్భంగా స్థానిక విలేకరులు ఆయా కార్యక్రమాలను కవర్ చేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్థానిక జర్నలిస్టు ఒకరు- లఖింపూర్ ఖేరీ కారు ఉదంతం గురించి ప్రశ్నించారు.
#WATCH | MoS Home Ajay Kumar Mishra 'Teni' hurls abuses at a journalist who asked a question related to charges against his son Ashish in the Lakhimpur Kheri violence case. pic.twitter.com/qaBPwZRqSK
— ANI UP (@ANINewsUP) December 15, 2021
ఈ కేసు విచారణ గురించి కేంద్రమంత్రిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన ప్రశ్న పూర్తి కాకముందే- అజయ్ మిశ్రా రెచ్చిపోయారు. ఆ జర్నలిస్టుపై విరుచుకుపడ్డారు. సిగ్గుందా అంటూ బూతులతో విరుచుకుపడ్డారు. మీడియా ప్రతినిధులు దొంగల్లా తయారయ్యారంటూ ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. ఫోన్ స్విచ్ఆఫ్ చేయాలంటూ దౌర్జన్యం చేశారు. ఈ కేసు విషయంలో ఏం తెలుసుకోవాలనుకుంటున్నావ్ అంటూ ఎదురుదాడికి దిగారు. దాదాపు కొట్టినంత పని చేశారు.