అంబానీకి భారీ షాక్: రూ.8వేలకోట్ల ఆదాయానికి గండి
భారత కుబేరుడు, జియోతో టెలికాం ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీకి భారీ షాక్ తగిలింది.
ముంబై: భారత కుబేరుడు, జియోతో టెలికాం ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీకి భారీ షాక్ తగిలింది. తన ప్రముఖ రిలయన్స్ గ్యాస్ అండ్ ట్రాన్స్ పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఆర్జీటీఐఎల్) రూ.8000 కోట్ల మేర నికర ఆదాయాన్ని కోల్పోయింది.
ఆర్ఐఎల్ క్రిష్ణా గోదావరి బేసిన్ ద్వారా తక్కువ గ్యాస్ సప్లై అవుతుండటంతో కంపెనీ ఈ నష్టాలను మూటకట్టుకుంది. క్రిష్ణా గోదావరి బేసిన్ నుంచి గుజరాత్ కు కనెక్ట్ అయిన 1400 కిలోమీటర్ల మేర గ్యాస్ పైప్ లైన్ను కంపెనీ కలిగివుంది.
ఆర్ఐఎల్ కేజీ బేసిన్ లో ఉత్పత్తిచేసే గ్యాస్ ద్వారా కంపెనీ భారీ ఆదాయాన్ని ఆర్జిస్తుంది. అయితే 2016 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర ఆదాయం రూ.2641 కోట్లు నెగిటివ్గా ఉన్నట్టు రిలయన్స్ గ్యాస్ ఫైలింగ్లో తెలిపింది.
ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ను పాటిస్తూ ఈ నికర ఆదాయాల ప్రకటనను తయారుచేశామని కంపెనీ చెప్పింది. 2010 నుంచి కంపెనీ ఒక్కసారి మాత్రమే లాభాలను ఆర్జించింది. ప్రిఫరెన్స్ షేర్ల ద్వారా కంపెనీ రూ.4000 కోట్లను ఆర్జించాలనే ఆలోచనలో ఉంది.
కాగా, ఉచిత కాల్స్, డేటా అందిస్తున్న జియోతో ప్రముఖ టెలికాం సంస్థలకు అంబానీ షాకిచ్చిన విషయం తెలిసిందే. జియో దెబ్బకు ఇతర టెలికాం సంస్థలు కూడా భారీగా టారీఫ్లు తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.