భారీ వర్షాలు, నిలిచిన రవాణా - విద్యా సంస్థలకు సెలవులు..!!
ముంబాయిని కండ పోత వర్షాలు ముంచెత్తుతన్నాయి. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వానలు నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రహదారులన్నీ జలమయమయ్యాయి. నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. నగరంలో ట్రాఫిక్ జామ్లు కొనసాగుతున్నాయి. అత్యవసరమైతే మినహా బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
భారీ వర్షాలతో
ముంబైలోని పలు శివారు ప్రాంతాలలో బుధవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ములుంద్, దాని పరిసరాల్లో భారీ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. అంధేరిలో ఓ మహిళ మ్యాన్హోల్లో పడి మృతి చెందింది. సెర్చ్ ఆపరేషన్లో ఆమె మృతదేహాన్ని వెలికితీశారు. భారీ వర్షాల ప్రభావంతో బుధవారం రాత్రి పలు విమానాలను కూడా దారి మళ్లించాల్సి వచ్చింది.

విమానాల మళ్లింపు
ముంబై విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం కారణంగా బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి ముంబై బయలుదేరిన ఓ విమానాన్ని తిరిగి వెనక్కి పంపారు. ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లాల్సిన మరో విమానాన్ని కూడా హైదరాబాద్కు మళ్లించారు. విమానయాన సంస్థలు స్పైస్జెట్, ఇండిగో, విస్తారా పలు విమానాలను దారి మళ్లించాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ముంబై కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
విద్యా సంస్థలకు సెలవు
ముంబై పొరుగు జిల్లాలను కూడా అప్రమత్తం చేసింది. అత్యంత భారీ వర్షాలు కురవచ్చని, ముంబై, థానే, రాయ్గఢ్, రత్నగిరి జిల్లాలకు తీవ్ర భారీ వర్షాల ముప్పు ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. దీంతో తీవ్ర వర్షాలు, వరదల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నేడు నగరంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వం ముంబాయిలో పరిస్థితుల పైన సమీక్ష చేస్తోంది.












Click it and Unblock the Notifications