అగ్ని ప్రమాదం: 'తేజాబ్' ఫిల్మ్ నిర్మాత, భార్య మృతి
ముంబై: దక్షిణ ముంబైలోని కెంప్స్ కార్నర్ ప్రాంతంలోని 26 అంతస్తుల భవన సముదాయంలోని 12వ అంతస్తులో శుక్రవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బాలీవుడ్ సినిమా నిర్మాత దినేష్ గాంధీ, అతని సతీమణి మరణించారు. వీరితోపాటు మరో ఏడుగురు వ్యక్తులు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఆర్మాన్, తేజాబ్ లాంటి చిత్రాలకు దినేష్ గాంధీ నిర్మాతగా వ్యహరించారు.
క్షతగాత్రులను రక్షించే క్రమంలో ఆరుగురు బ్రిగేడ్ సిబ్బంది, ఇద్దరు అధికారులు గాయాలపాలయ్యారు. కెంప్స్ కార్నర్ ప్రాంతంలోని 26 అంతస్తులు కలిగిన మాంట్ బ్లాంక్ భవనంలోని 12 అంతస్తులో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో దట్టమైన మంటలు అలుముకున్నాయి.
ప్రమాదంలో భవనంలో నివాసముంటున్న ఏడుగురు వ్యక్తులు మరణించారు. మృతుల్లో కొందరిని గుర్తించినప్పటికీ, మరికొందరు గుర్తించేందుకు వీలులేని విధంగా కాలిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. బాధితులను బిఎంసి నాయర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను నేవీ ముంబై ఐరోలిలోని నేషనల్ బర్న్స్ సెంటర్, జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. 14 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు.