‘రామ్ నామ్ సత్య్ హే’ అంటూ ముస్లింల నినాదాలు
భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. ఇది మన దేశంలో ఎప్పుడూ రుజువవుతూనే ఉంటుంది. తాజాగా ఇందుకు ఉదాహరణగా మరో ఘటన చోటు చేసుకుంది. కాలేయ కేన్సర్ వ్యాధితో మరణించిన ఓ హిందూ యువకుడికి ముస్లిములు హిందూ ధర్మం ప
మాల్దా: భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. ఇది మన దేశంలో ఎప్పుడూ రుజువవుతూనే ఉంటుంది. తాజాగా ఇందుకు ఉదాహరణగా మరో ఘటన చోటు చేసుకుంది. కాలేయ కేన్సర్ వ్యాధితో మరణించిన ఓ హిందూ యువకుడికి ముస్లిములు హిందూ ధర్మం ప్రకారం అంత్యక్రియలు జరిపారు.
అంతేగాక, అంత్యక్రియల సందర్భంలో రామ్ నామ్ సత్య్ హే అంటూ నినాదాలు కూడా చేయడం గమనార్హం. ఈ అరుదైన ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని మాల్దా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మాల్దా జిల్లా మాణిక్ చక్ బ్లాక్ పరిధిలోని షేక్పుర గ్రామానికి చెందిన బిశ్వజీత్ రజక్ అనే హిందూ యువకుడు కాలేయ కేన్సర్తో మరణించాడు.
నిరుపేద అయిన బిశ్వజీత్ అంత్యక్రియలు జరిపేందుకు సైతం అతని కుటుంబసభ్యుల వద్ద డబ్బులు లేవు. పెద్దగా బంధువులు కూడా లేరు. దీంతో ముస్లింలు అధికంగా నివాసముండే షేక్ పుర గ్రామంలో బిశ్వజీత్ ఇంటి పొరుగున ఉంటున్న ముస్లింలు ముందుకు వచ్చి అతనికి హిందూ ఆచారం ప్రకారం దగ్గరుండి అంత్యక్రియలు చేశారు.
వెదురు మంచంపై మృతదేహాన్ని ముస్లిమ్ లే ఎత్తుకొని 8 కిలోమీటర్ల దూరం ఊరేగింపుగా తీసుకువెళ్లి అంత్యక్రియలు జరిపించారు. శవ ఊరేగింపులో భాగంగా ముస్లిములే 'రామ నామ సత్య హై', 'బోలో హరి హరి బోలో' అంటూ పెద్దపెట్టున నినాదాలు చేయడం విశేషం. హిందూ ధర్మం ప్రకారమే విశ్వజీత్ అంత్యక్రియలు పూర్తి చేయించారు ముస్లింలు.
ముస్లిములు చూపిన ఔదార్యంతో స్ఫూర్తి పొందిన మాల్దా జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు గౌర్ మండల్ కూడా వారితో కలిసి బిశ్వజీత్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. హిందూ ముస్లిములు ఒక తల్లికి పుట్టిన ఇద్దరు కుమారులులాంటివారని, మనం ఒకరికి మరొకరు బాగా చూసుకోవాలని ముస్లిం మత పెద్దలు పిలుపునిచ్చారు. ఇదే స్ఫూర్తి మన దేశమంతా విస్తరించాలని వారు ఆకాంక్షించారు. కాగా, విశ్వజీత్ ఆస్పత్రి ఖర్చులను కూడా పొరుగన ఉండే ముస్లిం సోదరులే భరించడం అభినందనీయం.