ముజఫర్నగర్ అల్లర్లు: బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ అల్లర్ల కేసులో మొదటి రాజకీయ అరెస్టు జరిగింది. థానా భవన్ బిజెపి శాసనసభ్యుడు సురేష్ రాణాను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. శాసనసభా సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన తర్వాత ఆయన అరెస్టు జరిగింది. రాణా శాసనసభలో తన వాదనను వినిపించారు.
సమావేశాలు ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. దమ్ముంటే తనను అరెస్టు చేయాలని, నేరానికి పాల్పడినట్లు రుజువైతే శిక్ష వేయాలని ఆయన సవాల్ చేశారు. శాసనసభ నుంచి వెళ్లిపోయిన తర్వాత శుక్రవారం సాయంత్రం గోమతినగర్ ఏరియాలో ఆయనను అరెస్టు చేశారు.

సురేష్ రాణా అరెస్టును బిజెపి ఖండించింది. అధికార సమాజ్వాదీ పార్టీ నాయకులతో పాటు ఇతర రాజకీయ నాయకులపై ఏ చర్యలూ తీసుకోకపోవడాన్ని బిజెపి ఎత్తి చూపింది. బిజెపి ఇతర శాసనసభ్యులు హుకుమ్ సింగ్, సంగీత్ సింగ్, కున్వర్ భారతేందు సింగ్ కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.
ఇతర నిందితుల కోసం తాము గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇరవై మందిపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్లు జారీ చేశారు. వీరిలో పలువురు రాజకీయ నాయకులున్నారు. వారిలో ముగ్గురు బిజెపి శాసనసభ్యులు కూడా ఉన్నారు. బిఎస్పీ ఎంపి కదీర్ రాణా, బిఎస్పీ శాసనసభ్యులు నూర్ సలీం రాణా, మౌల్వీ జమీల్, కాంగ్రెసు మాజీ ఎంపి సయీద్ ఉజ్ జమాన్లపై స్థానిక కోర్టులు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్లు జారీ చేశాయి.












Click it and Unblock the Notifications