షాక్: ఆస్ట్రేలియాలో మైసూరు లేడీ టెక్కీ పరిస్థితి ఇది
మెల్బోర్న్/మైసూరు: నిర్లక్షంగా వాహనం నడపడంతో ఐదు మంది ప్రాణాలు గాలిలో కలిసి పోయి కర్ణాటకలోని మైసూరు నగరానికి చెందిన మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు కోమాలోకి వెళ్లిపోయిన ఘటన ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో జరిగింది.
మైసూరుకు చెందిన నేత్రా కృష్ణమూర్తి (30) అనే మహిళ ఇప్పుడు కోమాలో మృత్యువుతో పోరాడుతోంది. కులబర్గికి చెందిన నేత్రా కృష్ణమూర్తి మైసూరులోని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ లో విద్యాభ్యాసం చేశారు. మోహన్ కుమార్ తో నేత్రా పెళ్లి జరిగింది.
ఈమె మెల్బోర్న్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నారు. గత శుక్రవారం తన 8 నెలల బాబుకు పాలు తాగించిన నేత్రా కృష్ణమూర్తి తరువాత ఉద్యోగానికి బయలుదేరారు. కార్యాలయానికి బయలుదేరి వెలుతున్న కొన్ని నిమిషాలలోనే ఓ వ్యక్తి నిర్లక్షంగా వాహనం నడుపుతూ అటు వైపు దూసుకు వెళ్లాడు.
ఆ సమయంలో నేత్రాతో పాటు అనేక మందిని ఆ వాహనం ఢీకొనింది. నేత్రా శరీరం మీద వాహనం దూసుకు వెళ్లడంతో తీవ్రగాయాలైనాయి. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స చేస్తున్నారు.
నేత్రా మూత్రపిండాలు దెబ్బతిన్నాయని, శ్వాసతీసుకోవడం కష్టంగా ఉందని, తమ 8 నెలల చిన్నారిని చూసి ఆమె స్పందించడం లేదని, కోమాలో ఉందని నేత్రా భర్త మోహన్ కుమార్ విలపిస్తున్నాడు. సెలవుల పై మైసూరు వచ్చిన నేత్రా రెండు వారాల క్రితమే బాబును తీసుకుని ఆస్ట్రేలియా వెళ్లారని ఆమె భర్త చెప్పారు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన ఐదు మంది మరణించారు. అనేక మందికి గాయాలు కావడంతో మెల్బోర్న్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.