వారణాసికి మోడీ గుడ్బై...2019లో ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో తెలుసా..?
Recommended Video
2019 లో సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడి నుంచి పోటీచేస్తారు... ఇప్పుడు ఇదే పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశమైంది. 2014లో వారణాసి నుంచి బరిలో నిలిచిన నరేంద్ర మోడీ... ఈ సారి మరో టెంపుల్ టౌన్ నుంచి పోటీచేసే యోచనలో ఉన్నారా..? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే ప్రధాని మోడీ పోటీచేసేందుకు ఏ ఆలయనగరాన్ని ఎంచుకున్నారు...?
2019లో మోడీ ఎక్కడి నుంచి పోటీచేస్తారు..?
ప్రధాని నరేంద్ర మోడీ 2019 ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారా అనే దానిపై ఇటు బీజేపీలో అటు విపక్షపార్టీల్లో జోరుగా చర్చ జరుగుతోంది. 2014లో వారణాసి నుంచి పోటీచేసిన ప్రధాని మోడీ ఈ సారి ఒడిషాలోని పూరీ నుంచి బరిలో దిగనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఒడిషా బీజేపీ ఎమ్మెల్యే ఒకరు చెప్పారు. పదంపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రదీప్ పురోహిత్ మోడీ పూరీ నుంచి పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు.
పూరీ నుంచి మోడీ పోటీ చేస్తారా..?
2014లో ప్రధాని నరేంద్రమోడీ పూరీ జగన్నాథుని ఆలయంలో ఆశీసులు తీసుకుని వారణాసి నుంచి బంపర్ మెజార్టీతో గెలిచారని ప్రదీప్ గుర్తుచేశారు. ఒడిషా ప్రజలు ప్రధాని పూరీ నుంచి పోటీచేయాలనే కోరికను వ్యక్తం చేస్తున్నారని ప్రదీప్ పురోహిత్ చెప్పారు. పార్టీ కార్యకర్తలతో పాటు మోడీ కూడా పూరీ నుంచి పోటీచేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని ఎమ్మెల్యే ప్రదీప్ చెప్పారు. అంతకుముందు ప్రధాని మోడీని పూరి నుంచి పోటీ చేయించేందుకు ఒడిషా రాష్ట్ర బీజేపీ నాయకులు తీర్మానించినట్లు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బసంత్ పండా చెప్పారు. ఇదే అంశాన్ని మోడీని ఒక ఇంటర్వ్యూలో విలేఖరి ప్రశ్నించగా మీడియా వారికి ఒక పని దొరుకుతుందని చెబుతూ సమాధానం దాటవేశారు.
ఒడిషాపై కన్నేసిన కమలం పార్టీ
ఇక 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మోడీ పూరీ నుంచి పోటీ చేస్తే బీజేపీకి ఒడిషాలో మంచి గెలుపవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. అదేసమయంలో ఒడిషాలో గెలిచి తన సత్తా చాటాలని భావిస్తోంది బీజేపీ. ప్రస్తుతం ఒడిషాలో బీజేడీ ప్రభుత్వం ఉంది. అంతేకాదు గత 20 ఏళ్లుగా పూరీ లోక్సభ స్థానం బీజేడీనే గెలుస్తూ వస్తోంది. ఇదిలా ఉంటే 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోనే గెలుచుకుంది. అంటే ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అత్యధిక సీట్లలో కమలం పార్టీ విజయం సాధించింది. అయితే ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి పాలైంది. ఈ ప్రభావం రానున్న లోక్సభ ఎన్నికలపై కూడా పడే అవకాశం లేకపోలేదు. ఈక్రమంలోనే ఒడిషా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో మరిన్ని ఎక్కువ సీట్లు గెలవాలనే లక్ష్యంతో కమలనాథులు పనిచేస్తున్నారు.