దేశ వ్యాప్తంగా నేడే కరోనా వ్యాక్సిన్ డ్రైరన్: పూర్తి వివరాలివే, ఏపీలో 13, తెలంగాణలో రెండు జిల్లాల్లో
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారికి వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కోవిడ్ 19 వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లలో నిమగ్నమైంది. వ్యాక్సిన్ ఎవరికి ముందుగా ఇవ్వాలనేదానిపై వాలంటీర్ల జాబితాను కూడా సిద్ధం చేసింది. ఇందుకోసం కోవిన్ అనే యాప్ను కూడా రూపొందించింది.
ఎన్నికల్లానే వ్యాక్సినేషన్ కోసం..
ఎవరెవరికి వ్యాక్సిన్ ఇవ్వాలి? అనే జాబితా సమామాచారం మొత్తాన్ని ఆరోగ్యశాఖ అధికారులు ఆన్లైన్లో పెడుతున్నారు. కాగా, శనివారం దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలతోపాటు కేంద్ర ప్రాంతాల్లో వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించనున్నారు. ఈ ఏర్పాట్లపై అధికారులతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ.. దేశం ఎన్నికలకు ఎలా సిద్ధమవుతుందో.. కరోనా వ్యాక్సినేషన్ కోసం కూడా అదే స్థాయిలో సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. మెడికల్ టీంలోని ప్రతి ఒక్కరికీ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రెండు వ్యాక్సిన్ కంపెనీలు అనుమతి కోసం డీసీజీఐకి, నిపుణుల కమిటీకి దరఖాస్తు చేసుకున్నాయని ఆయన చెప్పారు.
డ్రైరన్ ఓ రిహార్సల్ లాంటిదే..
కాగా, వాస్తవంగా వ్యాక్సిన్కి నిపుణుల కమిటీ అనుమతి ఇచ్చిన వెంటనే భారీ ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ముందుగా హెల్త్ కేర్ వర్కర్లతోపాటు ఇతర కీలక విభాగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ డ్రై రన్ ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి పూర్తి ప్రణాళిక, దాని అమలుతోపాటు ఎదురయ్యే సవాళ్లపై అవగాహన వస్తుందని భావిస్తోంది. ఈ డ్రై రన్ ప్రక్రియ వ్యాక్సిన్ రాగానే.. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించే అవకాశం ఉంటుంది.
కాగా,నామమాత్ర పు(డమ్మీ) కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను డ్రై రన్గా వ్యవహరిస్తారు. ఇదొక మాక్ డ్రిల్ లాంటిదే.
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో డ్రై రన్..
ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో.. మొదటి విడతగా రెండు రోజులపాటు డ్రై రన్ నిర్వహించారు. డిసెంబర్ 28, 29వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్, అసోం, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ చేపట్టారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేయడానికి ఈ ప్రక్రియ తోడ్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. కాగా, వ్యాక్సిన్ అనుమతి కోసం మూడు కంపెనీలు డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్నాయి. ఫైజర్ తోపాటు ఆస్ట్రాజెనికా, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు కేంద్రం ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. కాగా, కోవిషీల్డ్కు నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. ఈ ఏడాది ఆగస్టు నాటికి 30 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.ఢిల్లీ, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, జమ్మూకాశ్మీర్, గుజరాత్, కేరళ, పంజాబ్, హర్యానా, కర్ణాటక రాష్ట్రాల్లోని డ్రైరన్ కేంద్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
తెలంగాణలో రెండు జిల్లాలో వ్యాక్సిన్ డ్రై రన్..
తెలంగాణ రాష్ట్రంలో శనివారం జరగనున్న కరోనా వ్యాక్సిన్ డ్రైన్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో ఈ డ్రైరన్ చేపట్టనున్నారు. హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రి, నాంపల్లి ఏరియా ఆస్పత్రి, తిలక్నగర్ యూపీహెచ్సీ, సోమాజిగూడ యశోద ఆస్పత్రుల్లో డ్రైరన్ చేపట్టనున్నారు. ఇక మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రి, పీహెచ్సీ, ఓ ప్రైవేటు ఆస్పత్రిలో డ్రైరన్ నిర్వహించనున్నారు. ఇక ఏపీలో 13 జిల్లాల్లోనూ శనివారం వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించనున్నారు. ప్రతి జిల్లాలోని మూడు ఆస్పత్రుల్లో డ్రై రన్కు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి జిల్లాలో ప్రభుత్వాస్పత్రి, ప్రైవేట్ ఆస్పత్రి, అర్బన్/రూరల్ పీహెచ్సీలో డ్రై రన్ నిర్వహించనున్నారు.