నిన్న మోడీకి, నేడు కేజ్రీవాల్కూ షాక్: కొత్త పార్టీ పెట్టనున్న సిద్ధూ
చండీగఢ్: నిన్న బీజేపీ నుంచి వెళ్లిపోయి ప్రధాని నరేంద్ర మోడీకి షాకిచ్చిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు కూడా షాకిస్తున్నారు. బీజేపీకి రాజీనామా చేసిన సిద్ధూ ఏఏపీలో చేరుతారనే ఊహాగానాలు వినిపించాయి.
అసలు బీజేపీ నుంచి బయటకు వచ్చిందే ఏఏపీలో చేరేందుకు. ఆయన బీజేపీకి రాజీనామా చేసినప్పుడు కేజ్రీవాల్ ఆయనను ప్రశంసించారు. కానీ ఇప్పుడు అదే కేజ్రీవాల్కు సిద్ధూ ఝలక్ ఇస్తున్నారు. ఆయన పంజాబ్లో అవాజ్ ఈ పంజాబ్ పేరుతో కొత్త పార్టీ పెడుతున్నారు.
పంజాబ్కు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ నేతల పీచమణిచేందుకే తాను కొత్త పార్టీని పెడుతున్నట్టు సిద్ధూ చెప్పారు. తాను ఏ పార్టీలోనూ చేరబోనని, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్, అకాలీదళ్ నేత పర్గత్ సింగ్తో కలసి తాను 'ఆవాజ్ ఏ పంజాబ్' పేరిట కొత్త పార్టీని పెడుతున్నానన్నారు.
లూథియానాకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యేలు సిమర్జిత్ సింగ్ బైన్స్, బల్వీందర్ సింగ్ బైన్స్ తమతోనే ఉన్నారని, మరెంతో మంది మాజీ ప్రజా ప్రతినిధులు తమ పార్టీలో భాగస్వాములన్నారు. పార్టీ విధానాలు, కోర్ కమిటీ తదితర వివరాలను తొమ్మిదో తేదీ తర్వాత తెలియజేస్తామన్నారు.
సాధ్యమైనంత త్వరగా మ్యానిఫెస్టోతో పాటు పార్టీ తరఫున పోటీ పడే అభ్యర్థుల వివరాలనూ వెల్లడిస్తామన్నారు. కాగా తన భర్త కొత్త పార్టీపై సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ స్పందిస్తూ.. ఏఏపీ లేదా కాంగ్రెస్లో చేరేందుకు తన భర్త మనసు అంగీకరించలేదన్నారు. అందువల్లే ఆయన కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారని, ఆయన ఆలోచనను తాను స్వాగతిస్తున్నానన్నారు.