కాంగ్రెస్ కన్నా ఎన్సీపీ మెరుగైన ప్రదర్శన.. మహారాష్ట్రలో ప్రజాతీర్పును గౌరవిస్తున్నా: పవార్
మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎన్సీపీ ప్రదర్శనపై సంతృప్తితో ఉన్నట్టు ప్రకటించారు. ఎన్నికల ఫలితాల ట్రెండ్ వెలువడుతున్న సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి బీజేపీ-శివసేన మహారాష్ట్రలో టాప్ స్పీడ్లో వెళ్తున్నాయి. కాంగ్రెస్-ఎన్సీపీ మాత్రం రేసులో వెనకబడ్డాయి. అయితే శివసేన తమకు సీఎం పీఠం అప్పగించాలని డిమాండ్ చేయడంతో ఉత్కంఠ నెలకొంది.
ఎన్సీపీ కీ రోల్
మరాఠా ఎన్నికల్లో ఎన్సీపీ తన శక్తి మేర పనిచేసింది. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు పార్టీ నుంచి కీలక నేతలు వీడారు. బీజేపీ-శివసేనలో చేరి శరద్ పవార్కు షాకిచ్చారు. దీంతో అభ్యర్థుల ఎంపిక అనే అంశం పవార్కు కత్తిమీద సాములా మారింది. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ ల్యాండరింగ్ కేసు తెరమీదకు వచ్చింది. దీంతో ఎన్సీపీ చీఫ్ విచారణ అంశం ఉత్కంఠ కలిగించింది. అయితే తాము విచారణకు పిలుస్తామని చెప్పి.. ఆ ఎపిసోడ్ ముగిసినా.. శరద్ పవార్కు సెంటిమెంట్ మాత్రం కలిసొచ్చింది.
విపక్షానికే పరిమితం..
కౌంటింగ్ తొలుతలోనే ట్రెండ్ అర్థమైంది. బీజేపీ-శివసేన దూసుకెళ్లింది. కానీ సాతారా జిల్లాలో మాత్రం ఎన్సీపీ ఖాతా తెరిచింది. ఆయా చోట్ల కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా ఎన్సీపీ అభ్యర్థులు విజయం దిశగా దూసుకెళ్తున్నారు. బీజేపీ-శివసేన కూటమి అధికారం చేపట్టడం దాదాపు ఖాయమవడంతో.. ఎన్సీపీ అభ్యర్థి సభలో విపక్ష హోదా పొందే అవకాశం ఉంది.
పశ్చిమలో హవా..
పశ్చిమ మహారాష్ట్రలో మొత్తం 66 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎన్సీపీ గత ఎన్నికల కన్నా మెరుగైన ప్రదర్శన కనబరిచింది. 2014లో కేవలం 18 సీట్లు గెలుచుకోగా.. ప్రస్తుతం అది 27 సీట్లకు చేరింది. పశ్చిమ మహారాష్ట్రలో బీజేపీ 16 సీట్లలో లీడ్లో ఉంది. 2014లో 22 సీట్లు గెలిచిన బీజేపీ దాదాపు 6 సీట్లను కోల్పోయింది.
కాంగ్రెస్ కూడా
కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటును పెంచి మెరుగైన ప్రదర్శన కనబరిచింది. 2014లో కేవలం 10 సీట్లు గెలచుకోగా.. ఈసారి 11 సీట్లలో లీడ్లో ఉంది. 2014లో బీజేపీ-శివసేన మెజార్టీ స్థానాలు గెలిచి అధికారం చేపట్టాయి. బీజేపీ, శివసేన చెరో 20, 20 సీట్లతో విజయం సాధించాయి. ఇక్కడున్న గిరిజనులను ఆ రెండు పార్టీ నేతలు ఆకట్టుకోగలిగారు.