బాలికపై అత్యాచారం: కేకలు వేసిన బాలుడి హత్య
న్యూఢిల్లీ: అమ్మాయిపై అత్యాచారం చేస్తున్న సమయంలో కేకలు వేసిన బాలుడిని హత్య చేసిన దారుణ సంఘటన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో జరిగింది. అత్యాచారం చేసి బాలుడిని హత్య చేసి పరారైన నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఢిల్లీలోని స్వరూప్ నగరలో నివాసం ఉంటున్న బాలిక (17)కుటుంబ సభ్యులు శనివారం రాత్రి బంధువుల ఇంటికి వెళ్లారు. బాలిక ఇద్దరు సోదరులు (మైనర్లు)తో కలిసి ఇంటిలో నిద్రపోయింది.
బాలిక ఇంటి సమీపంలోని ఓ గదిలో రాజు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. బాలిక కుటుంబ సభ్యులు లేరని తెలుసుకున్న రాజు బాలిక ఇంటిలోకి చోరబడ్డాడు. తరువాత బాలిక మీద అత్యాచారం చేశాడు బాలిక బాధతో కేకలు వేసింది.
ఆ సమయంలో పక్కనే నిద్రపోతున్న బాలిక సోదరుడు (10) నిద్రలేచి కేకలు వేశాడు. ఆ సందర్బంలో చిక్కిపోతామని భయపడిన రాజు దుప్పటి తీసుకుని బాలుడికి ఉరి వేసి చంపేశాడు. కేకలు వినపడంతో మిద్దె మీద నివాసం ఉంటున్న ఇంటి యజమానురాలు కిందకు వచ్చారు.
అప్పటికే రాజు అక్కడి నుంచి తప్పించుకుని పరారైనాడు. వెంటనే బాలుడిని ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అయితే అప్పటికే బాలుడు మరణించాడని వైద్యులు చెప్పారు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమ కుమార్తెను రాజుకు ఇచ్చి పెళ్లి చెయ్యాలని నిర్ణయించామని, అయితే ఇంతలోనే ఈ దారుణం జరిగిందని బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి అత్యాచారం, హత్య చేసి పరారైన రాజు కోసం గాలిస్తున్నారు.