బాత్రూమ్ వెళ్లి అతడు చేసిందానికి.. ప్రయాణికుల టెన్షన్
తిరువనంతపురం : మానసిక స్థితి సరిగా లేని ఓ ప్రయాణికుడు..కదులుతున్న రైళ్లోనే ఆత్మహత్యకు యత్నించడంతో భయాందోళనకు గురయ్యారు ప్రయాణికులు. రైలు జనరల్ బోగిలో ఉన్న బాత్రూమ్ లోకి వెళ్లిన సదరు ప్రయాణికుడు సజీవ దహనానికి యత్నించాడు. తన లో దుస్తులపై పెట్రోలు పోసి నిప్పంటించడంతో భారీగా మంటలు వ్యాపించాయి.
మంటల దాడికి భారీగా వెలువడ్డ పొగ పక్క బోగీలను కమ్మి వేయడంతో.. చైన్ లాగి రైలును మధ్యలోనే నిలిపేశారు ప్రయాణికులు. తిరువనంతపురం నుంచి లోకమాన్య తిలక్ టెర్మినస్ వెళ్తున్న నేత్రావతి ఎక్స్ ప్రెస్ రైలులో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని కయంకుళం స్టేషన్ దాటిన కొద్దిసేపటి తర్వాత, ఓ వ్యక్తి బాత్రూమ్ లోకి గడియపెట్టుకున్నాడు.
అనంతరం వెంట తీసుకొచ్చిన దుస్తులపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ లాగి రైలును నిలిపివేసి, పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం మంటలను చల్లార్చగా.. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే ఘటనలో ప్రాణ పాయం ఏమి జరగలేదని, ఆత్మహత్యకు యత్నించిన సదరు వ్యక్తి మానసిక స్థితి సరిగా లేదని తెలిపారు పోలీసులు.