విద్యార్థినిని కౌగిలించుకునే యత్నం, ప్రొఫెసర్పై కేసు
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఓ విద్యార్థిని పట్ల ప్రొఫెసర్ అనుచితంగా ప్రవర్తించిన విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, విచారణ జరుపుతున్నారు.
ఢిల్లీ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాల సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో ఇది జరిగింది. విద్యార్థిని కళాశాలలో పీహెచ్డీ చేస్తోంది. తనకు గైడ్గా ఉన్న సదరు ప్రొఫెసర్ రెండేళ్లుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆమె ఆరోపించారు.
నిందితుడి పేరు సతీష్ కుమార్. అతను 2013 అక్టోబర్ నెలలోనే ఆమె పైన తొలిసారి అనుచితంగా ప్రవర్తించాడు. అయితే, అతను తన కెరీర్ను చిక్కుల్లోకి నెడతారేమోననే అభిప్రాయంతో ఆమె అతని పైన అప్పుడే ఫిర్యాదు చేయలేదు.
కానీ ప్రొఫెసర్లో మార్పు లేదు. పలుమార్లు ఆమెను ముట్టుకోవడం, కౌగిలించుకోవాలని చూడటం చేశాడు. ల్యాబ్లో ఇలాంటివి చేసేవాడు. అంతేకాదు, ఓసారి పసుపు రంగు చీర కట్టుకొని రమ్మని బెదిరించాడు. లేదంటే యాసిడ్ పోస్తానని చెప్పాడు.
అంతేకాదు, బాధితురాలితో శృంగారం, వివాహేతర సంబంధాల గురించి మాట్లాడేవాడు. తాను చెప్పినట్లు నడుచుకోకుంటే గైడ్ చేయడం మానేస్తానని బెదిరించాడు. అతని వేధింపులు భరించలేక నిరుడు డిసెంబర్లో ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేసింది. కానీ ఫలితం లేదు.
ప్రిన్సిపల్ తన ఫిర్యాదును పట్టించుకోకపోవడమే కాకుండా, తన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తెచ్చాడని ఆమె ఆరోపించింది. వేధింపులు భరించలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.