కార్పొరేట్లకు బలైపోతాం.. కాపాడండి -సుప్రీంకోర్టును ఆశ్రయించిన రైతులు -బీజేపీ భారీ ఎదురుదాడి
వ్యవసాయ రంగంలో కీలక సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల సవరించిన చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతుల చేపట్టిన నిరసనలు శుక్రవారంతో 16వ రోజుకు చేరాయి. రైతులు డిమాండ్ చేస్తున్నట్లుగా వ్యవసాయ చట్టాలను వాపస్ తీసుకోవడానికి కేంద్రం నో చెబుతుండటం, పలు దఫాల చర్చలు విఫలం కావడంతో అన్నదాతలు అనూహ్య రీతిలో అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు వ్యవసాయ చట్టాల వ్యతిరేకుల భరతంపట్టేలా బీజేపీ భారీ ఎదురుదాడులకు ప్రణాళిక సిద్ధం చేసింది. వివరాల్లోకి వెళితే..

కార్పొరేట్ల నుంచి కాపాడండి..
సంస్కరణల పేరుతో కేంద్రం రూపొందించిన కొత్త వ్యవసాయ చట్టాలను సవాలు చేస్తూ రైతు సంఘాల ఐకాసా సుప్రీంకోర్టు గడప తొక్కింది. కొత్త చట్టాల వల్ల రైతులు కార్పొరేట్లకు బలవుతారని, ఆ పెను ముప్పు నుంచి న్యాయస్థానమే తమను కాపాడాలని భారతీయ కిసాన్ యూనియన్ శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. రైతు సంఘాల తరఫున ప్రముఖ న్యాయవాది ఏపీ సింగ్ వాదిస్తున్నారు. పార్లమెంటులో సరిగా చర్చించకుండా, కనీసం రైతు వర్గాలను పరిగణలోకి తీసుకోకుండా వ్యవసాయ చట్ట సవరణలను కేంద్రం హడావుడిగా పూర్తిచేసిందని, కార్పోరేట్ల లబ్ది కోసమే కేంద్రం పనిచేస్తున్నట్లుగా ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. దీని విచారణపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరోవైపు..

నిరసనలు తీవ్రతరం
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు కొనసాగిస్తున్న నిరసనలను మరింత తీవ్రతరం చేయాలని సంఘాల నేతలు నిర్ణయించారు. ఈనెల 12న(శనివారం) హైవేల దిగ్బంధనానికి పిలుపునిచ్చిన రైతులు.. ఈనెల 14 నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని ప్రకటించారు. చట్టాలను వెనక్కి తసుకోకపోతే రాబోయే రోజుల్లో రైల్వే లైన్ల దిగ్బంధనం చేపడతామని రైతు సంఘాల ఐకాస తెలిపింది. వ్యవసాయం అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం అయినప్పుడు కేంద్రం అనవసరంగా జోక్యం చేసుకోవడం, కార్పోరేట్లకు అనుకూలంగా చట్టాలు చేయడం దారుణమని రైతులు ఆరోపిస్తున్నారు. కాగా,

తలుపులు తెరిచే ఉన్నాయి..
పలు దఫాలుగా వివిధ రంగాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే వ్యవసాయ చట్టాల్లో సంస్కరణలు చేశామని, ఇవి కచ్చితంగా రైతుల జీవితాల్లో మార్పు తెస్తాయని, ఇన్నేళ్ల అన్యాయం తొలగిపోతుందని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే మోదీ సర్కారు ధ్యేయమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. కేంద్రం పంపిన ప్రతిపాదనలపై రైతు సంఘాలు ఇప్పటిదాకా వివరణ ఇవ్వలేదని, ఒకవేళ రైతులు కేంద్రంతో మాట్లాడాలనుకుంటే చర్చలకు ఎల్లప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని తోమర్ చెప్పారు. ఇప్పటికైనా రైతు సంఘాలు తమ నిరసన మార్గాన్ని వీడి చర్చలపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. ఇదిలా ఉంటే..

అగ్రి చట్టాలపై బీజేపీ రచ్చబండలు
కొత్త వ్యవసాయ చట్టాలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతోన్న తరుణంలో అధికార బీజేపీ ఎదురుదాడి తరహా ప్రణాళికలు రూపొందించింది. వ్యవసాయ చట్టాల వల్ల ఎంతగా మేలు జరుగుతుందో ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా రచ్చబండలు, మీడియా సమావేశాలు నిర్వహించనుంది. అన్ని జిల్లాల్లో ప్రెస్ మీట్లు, రచ్చబండలను తక్షణమే ప్రారంభించాలని, దేశవ్యాప్తంగా దాదాపు 700 విలేకర్ల సమావేశాలు, సుమారు 700 రచ్చబండలు నిర్వహించి, ఈ చట్టాలపై రైతుల్లో ఏర్పడిన సందేహాలను నివృత్తి చేయాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది.నిర్ణయించింది.












Click it and Unblock the Notifications