కొత్త రూ. 500, రూ 2000 నోట్లు ఇవే
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఉన్న రూ.500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ కొత్త రూ.500, 2000 వేల రూపాయల నోట్లను ప్రవేశపెడుతున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. ఆయన మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ చేసిన సంచలన ప్రకటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
రద్దు చేసిన పాత 500, 1000 రూపాయల కరెన్సీ స్థానంలో భారత ప్రభుత్వం కొత్త నోట్లను రూపొందించింది. ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలోనే కొత్త నోట్లకు సంబంధించిన ఫొటోలను రిజర్వ్ బ్యాంక్ వర్గాలు విడుదల చేశాయి. ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న రూ.2000 నోటుకు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆమోదం తెలిపింది.
ఈ ఫోటోల్లో కనిపిస్తున్న నోట్లు అతి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వస్తాయని ప్రధాని చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను రిజర్వ్ బ్యాంక్ అధికారులు వెల్లడిస్తారని చెప్పారు. ఎక్కువ విలువ గల నోట్లను పరిమిత సంఖ్యలో ముద్రిస్తారని ఆయన చెప్పారు.
నవంబర్ 11వ తేదీ వరకు అన్ని పెట్రోల్ బంకుల్లోనూ రూ.500, 1000 నోట్లు చెల్లుతాయని చెప్పారు. చెలామణి విషయంలో ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.రైళ్లు, బస్సులు, విమానాల కౌంటర్లలోన వాటి చెలామణి ఉంటాయని చెప్పారు.
ఈ రోజు అర్థరాత్రి నుంచి ఐదు వందలు, వేయి రూపాయల నోట్లు చట్టబద్ధం కావని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. కరెన్సీ నోట్లకు కేవలం కాగితాలు మాత్రమేనని, వాటికి ఏ మాత్రం విలువ ఉండదని చెప్పిన విషయం తెలిసిందే.