ఈ నెల 24 నుంచి సిమ్ కార్డు నిబంధనల్లో మార్పులు- ఇకపై ఆటోమేటిక్ గా
దేశంలో మొబైల్ కనెక్షన్ల జారీలో నూతన నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈ నెల 24వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా వీటిని అమల్లోకి తీసుకుని రాబోతోంది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలు సైతం రూపొందించింది.. టెలికమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ. సిమ్ కార్డుల జారీ విషయంలో కఠిన నిర్ణయం తీసుకుంది. అంతే కఠినంగా ఈ నూతన నిబంధనలను అమలులోకి తేబోతోంది.
మొబైల్ కనెక్షన్లు, సిమ్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఒక వ్యక్తి తన పేరు మీద నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ మొబైల్ కనెక్షన్లు కలిగి ఉంటే, వారికి నూతనంగా మరో సిమ్ కార్డు జారీ చేయకూడదని కేంద్రం టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది. అంటే.. పరిమితి మించిన వినియోగదారులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నూతన సిమ్ అనేది ఇవ్వరు. వీటిని పూర్తిగా నిలిపివేయనున్నారు.

తాజా టెలికాం నిబంధనల ప్రకారం.. దేశంలో ఒక పౌరుడు తన ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రాలపై గరిష్టంగా తొమ్మిది మొబైల్ కనెక్షన్లను మాత్రమే పొందేందుకు అనుమతి ఉంటుంది. జమ్మూ కాశ్మీర్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల ప్రజల భద్రత కారణాల రీత్యా ఈ పరిమితిని గరిష్టంగా ఆరు సిమ్ కార్డులుగా నిర్ణయించారు. ఆయా రాష్ట్రాల యూజర్లు ఆరుకు మించి ఎక్కువ సిమ్ కార్డులను పొందలేరు. వేర్వేరు టెలికాం కంపెనీల సిమ్ కార్డులను వాడుతున్నప్పటికీ కూడా మొత్తంగా ఉండాల్సిన కనెక్షన్ల సంఖ్య ఈ లిమిట్ దాటకూడదు.
వినియోగదారులకు ఇప్పటికే వివిధ నెట్వర్క్ లలో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయనే విషయాన్ని రియల్ టైమ్ లో సరిపోల్చుకోవడానికి టెలికాం కంపెనీలన్నీ కూడా డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ సెంట్రలైజ్డ్ డిజిటల్ డేటాబేస్ ఆధారంగానే నూతన కనెక్షన్లు కోరేవారి అర్హతను ఆపరేటర్లు పరిశీలిస్తారు. ఇప్పటికే గరిష్ట పరిమితిని దాటిన వినియోగదారులు మరో సిమ్ కార్డును పొందకుండా అడ్డుకోవడానికి దేశంలోని ప్రైవేట్, ప్రభుత్వ రంగానికి చెందిన టెలికాం సంస్థలు తమ సాంకేతిక, వ్యవస్థాగత మౌలిక వసతులలో మార్పులు చేపట్టాయి.
ఈ నూతన సాంకేతిక నిఘా వ్యవస్థ నిర్వహణలో భాగంగా ఈ నెల 23వ తేదీ నుంచి గరిష్ట అర్హత పరిమితిని దాటిన ప్రతి సబ్స్క్రైబర్ కు సంబంధించిన రెప్రజెంటేటివ్ ఫొటోను డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ద్వారా టెలికాం ఆపరేటర్లకు అందుబాటులో ఉంచనున్నారు. దీనివల్ల నకిలీ గుర్తింపు పత్రాలు లేదా ఇతరుల పేర్లతో అదనపు మొబైల్ కనెక్షన్లను పొందడానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించే వారిని వినియోగదారుల సేవా కేంద్రాల ప్రతినిధులు తక్షణమే గుర్తించగలుగుతాయి.
దేశవ్యాప్తంగా ఒకే వ్యక్తి పేరిట పదుల సంఖ్యలో సిమ్ కార్డుల ఉండటం వల్లే సైబర్ మోసాలు, బ్యాంకింగ్ అక్రమాలు, ఇతరుల వ్యక్తిగత వివరాలను చోరీ చేసే ఘటనలు చోటు చేసుకుంటోన్నట్లు కేంద్ర ఐటీ, టెలికాం శాఖలు గుర్తించాయి. సామాన్య ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, చట్టాల నుంచి సులభంగా తప్పించుకోవడానికి నేరగాళ్లు ఇలాంటి అనుమానాస్పద కనెక్షన్లను వినియోగిస్తున్నారని తేల్చాయి.
ఇప్పటికే తొమ్మిది మొబైల్ కనెక్షన్లు ఉంటే.. ఆగస్టు 24 నుంచి మీరు ఏ ప్రొవైడర్ ద్వారా కూడా పదో కనెక్షన్ను క్లెయిమ్ చేయలేరు. అలాగే.. తొమ్మిది కంటే ఎక్కువ సిమ్ కార్డులు ఉంటే అవి తీసుకున్న తేదీల ప్రకారం.. ఆటోమేటిక్ గా ఇనాక్టివ్ అవుతాయి. ఈ చర్యల వల్ల టెలికాం రంగానికి సంబంధించిన చందాదారుల డేటా మరింత స్పష్టంగా, పారదర్శకంగా మారుతుందని కేంద్రం చెబుతోంది.













Click it and Unblock the Notifications