నయా సాల్, నయా బాత్: ప్రధాని మాట కోసం ప్రజల నిరీక్షణ, హోటళ్లు, రెస్టారెంట్లలో పెద్ద స్క్రీన్ల ఏర్పాటు
మరికొన్ని గంటల్లో దేశ ప్రజలు కొత్త సంవత్సరంలోకి అడుగిడబోతున్నారు. ఈ న్యూ ఇయర్ స్పెషల్ ఏమిటంటే.. మన ప్రధాని మోడీ జాతి నుద్దేశించి ప్రసగించబోవడం.
హైదరాబాద్: మరికొన్ని గంటల్లో దేశ ప్రజలు కొత్త సంవత్సరంలోకి అడుగిడబోతున్నారు. అయితే ఇప్పటి వరకు వచ్చిన కొత్త సంవత్సరాలు వేరు.. ఇప్పుడు రాబోతున్న కొత్త సంవత్సరం వేరు. ఈ న్యూ ఇయర్ స్పెషల్ ఏమిటంటే.. మన ప్రధాని మోడీ జాతి నుద్దేశించి ప్రసగించబోవడం.
అవును, శనివారం రాత్రి... అంటే మరికొద్ది గంటల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయన తన ప్రసంగంలో ఏం చెబుతారో అని అందరిలోనూ ఒకటే ఉత్కంఠ.
అసలే నోట్ల రద్దు నేపథ్యం.. గత 50 రోజులుగా సామాన్య ప్రజానీకం బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరిగి అలసిపోయి ఉన్నారు. మరి ప్రధాని తన ప్రసంగంలో సామాన్యులపై వరాల జల్లు కురిపిస్తారో, లేక మరిన్ని రోజులు ఈ ఇబ్బందులు తప్పవంటారో!
మరోవైపు నల్లధనం కూడబెట్టుకున్న అవినీతిపరుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయనే చెప్పాలి. నల్లబాబుల మనసుల్లో పులిమీద పుట్రలా ఎప్పుడు ఏం వార్త వినాల్సి వస్తుందో అన్న ఆందోళన. వెరసి.. జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం అంశం ఇప్పుడు అందరికీ 'టాక్ ఆఫ్ ది డే'గా మారిపోయింది.
ఎన్నడూ లేనివిధంగా కొత్త సంవత్సరానికి జరుగుతున్న స్వాగత కార్యక్రమాలలో ఈసారి మోడీ ప్రసంగం అనేది ఒక హైలైట్ గా నిలుస్తోంది. కొత్త ఏడాదికి స్వాగతం చెప్పేందుకు ఏటా ఏర్పాటు చేసే సినీ తారలు, మోడళ్ల నృత్య ప్రదర్శనలు, ఆపైన డ్రింక్.. డ్యాన్స్.. ఎంజాయ్ అంటూ ఒకరకమైన జోష్ చూపించే యువతరం కూడా ప్రధాని ఏం మాట్లాడతారో అని ఆసక్తిగా ఎదురు చూస్తుండడం గమనార్హం.
మరోవైపు ప్రధాని మోడీ ప్రసంగాన్ని తమ కస్టమర్లకు ఒక అద్భుతమైన అనుభవంగా మలచాలనే భావనలో దేశంలోని ప్రముఖ హోటళ్ళు, రెస్టారెంట్లు తహతహలాడుతున్నాయి. ఇందుకు అనుగుణంగా తమ హోటళ్ళు, రెస్టారెంట్లలో కనీవినీ చూడని రీతిలో పెద్ద పెద్ద స్క్రీన్లపై 'లైవ్' అందించేందుకు అవి సిద్ధమవుతున్నాయి.
అంతటితో ఆగకుండా ఈసారి కొన్ని హోటళ్ళలో ప్రత్యేకంగా ప్రధాని ప్రసంగంపై చర్చావేదిక నిర్వహించేందుకు షో యాంకర్స్ ను కూడా ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించే ఈవెంట్ మేనేజర్లు, ఆర్గనైజర్లు కొందరు ఈ రకమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
శంషాబాద్ లో నిర్వాణ-2017 పేరుతో కొత్త సంవత్సర స్వాగత వేడుకలు నిర్వహిస్తున్న పేజ్-3 ఈవెంట్స్ సంస్థ డైరెక్టర్ వినేష్ సిన్హా మాట్లాడుతూ... " ఈసారి అందరి కళ్ళు పీఎం మోడీ పైనే ఉన్నాయని, ఆయన తన ప్రసంగంలో కొన్ని పెద్ద నిర్ణయాలే ప్రకటిస్తారని భావిస్తున్నామని.." అన్నారు.